పీకేపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు-అవన్నీ వాడుకుంటాం-వైసీపీది ఒంటరిపోరే
కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయన కలిసి పనిచేస్తున్న టీఆర్ఎస్, వైసీపీల భవిష్యత్ పై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీకే కాంగ్రెస్ లో చేరితే, పీకే కాంగ్రెస్ తో జట్టు కడితే వైసీపీ, టీఆర్ఎస్ ల భవిష్యత్తు ఏంటనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీప మాజీ మంత్రి పేర్నినాని ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు వాడుకుంటామంటూ వైసీపీ తాజా మాజీ మంత్రి పేర్నినాని ఇవాళ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్ని నాని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలు మాత్రమే వాడుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమకు ఎవరితో పొత్తులు అవసరం లేదని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మా ఎంపీల ఓట్లు అవసరం అయితే ఎవరికైనా మద్దతు ఇస్తామంటూ పేర్నినాని మరో కీలక విషయం బయటపెట్టారు. కాంగ్రెస్ వైసీపీ పొత్తు కోరుకుంటున్న నేపథ్యంలో పేర్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని పేర్ని ఇవాళ స్పష్టం చేశారు. వైకాపాను శాసించే ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. మే 2వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్తామని, ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.
రేపు జగన్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే విషయంపై ఆయన కీలక సూచనలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ తాజా మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.