జగన్ పదవి పీకేసి మంచి పని చేశారు- వచ్చే ఎన్నికల్లో కష్టమే- వైసీపీ మాజీ మంత్రి కామెంట్స్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం జగన్ కేబినెట్ ను ప్రక్షాళన చేశారు. ఇందులో పలువురు మంత్రులకు అవకాశాలు దక్కాయి. అలాగే పాత మంత్రులు కూడా పలువురు తమ స్ధానాలు కాపాడుకున్నారు. అలాగే పలువురు పాత మంత్రులు అవకాశం దక్కించుకోలేకపోయారు. ఇలా మంత్రి పదవులు దక్కించుకోలేకపోయిన పలువురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరో మాజీ మంత్రి స్పందించారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ తొలి కేబినెట్ లో తొలిసారి మంత్రిగా స్ధానం దక్కించుకున్న అనిల్ కుమార్ యాదవ్ కు ఆ తర్వాత రెండో కేబినెట్లో మాత్రం స్ధానం దక్కలేదు. దీంతో అసంతృప్తిగా కనిపిస్తున్న ఆయన.. పార్టీ చెప్పినట్లుగా గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో మాత్రం చురుగ్గానే పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మంత్రి పదవి నుంచి తొలగించి మంచి పనిచేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి పోయిన తర్వాత ఎవరు తనతో వున్నారో.. ఎవరు వుండరో అర్ధమైందని అనిల్ వెల్లడించారు. పలువురు కార్పోరేటర్లు తనను వీడినా బాధపడనని.. 2014లో బలమైన వర్గానికి చెందిన మేయర్తో పాటు పలువురు కార్పోరేటర్లు తనను విడిచిపెట్టారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు తనను ఎందుకు వీడారో అర్ధం కాలేదన్నారు. తనను వీడినవాళ్లు అనిల్ అన్యాయం చేశాడా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలని మాజీ మంత్రి వారికి సూచించారు.
గత ఎన్నికల్లో నెల్లూరులో తన ప్రత్యర్ధి రూ.180 కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానని అనిల్ కుమార్ గుర్తుచేశారు.
తాజాగా నగరంలో జరిగిన ఆర్య వైశ్య సంఘం కార్యక్రమంలో అందరూ రూ.100 కోట్లు పైబడి ఆస్తులు వున్నవారు వున్నారని, వేదిక మీద అంతా వెయిట్ వున్నవాళ్లు వున్నారని, తనకు వెయిట్ లేదని పిలవలేదేమో అంటూ అనిల్ కుమార్ యాదవ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో పోట్లు కొత్త కాదని అనిల్ వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారని, కొంతమంది వెళ్తారని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు తనకు చాలా కష్టం అంటున్నారని, తాను ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. ప్రజలే తన వెంట వున్నారని అనిల్ తెలిపారు.












Click it and Unblock the Notifications