పెద్ద తప్పు చేశాం.. జగన్ కు చెప్తా.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న షాకింగ్..!
ఏపీలో గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వైసీపీ నేతలు క్రమంగా నోరు విప్పుతున్నారు. గతంలో తాము చేసిన తప్పిదాలు, పార్టీ చేసిన తప్పిదాలు, వాటి కారణంగా ఎదురైన పరాజయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ చేసిన ఓ అతిపెద్ద తప్పిదాన్ని పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇవాళ బయటపెట్టారు. ఆ తప్పు చేసి ఉండకపోతే మాత్రం ఇవాళ అధికారంలో కొనసాగేవాళ్లమన్నారు. ఇదే విషయం అధినేత వైఎస్ జగన్ కు కూడా చెప్తానంటున్నారు.
మోడీ ఈ దేశ ప్రధాన మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇవాళ తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లకుండా తప్పుచేసినట్లు ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ ఎదురుచూసినా వైసీపీ కలిసి వెళ్లకుండా తప్పు చేసిందన్నారు. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని అధినేత జగన్ దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్తానన్నారు.

బీజేపీతో కలిసి ముందుకెళ్లకుండా తాము చేసింది తప్పేనన్నారు. గత ఐదేళ్లూ పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభల్లో బీజేపీ తెచ్చిన ప్రతీ బిల్లుకూ తాము మద్దతు ఇచ్చినట్లు ప్రసన్న వెల్లడించారు. అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చన్నారు. మోడీ మాటిస్తే కట్టుబడి ఉంటారన్నారు. మోడీ, అమిత్ షాకూ చంద్రబాబుపై నమ్మకం లేదన్నారు. ఇదే చంద్రబాబు మోడీ, ఆయన భార్య గురించి అసెంబ్లీలో ఎలా మాట్లాడారో అందరూ చూశారన్నారు.
గతంలో అమిత్ షా తిరుమలకు వస్తే చంద్రబాబు రాళ్లు, చెప్పులు వేయించారని గుర్తుచేశారు. అలాగే గుజరాత్ లో మోడీ సీఎంగా ఉండగా ఆయన్ను హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు చెప్పిన విషయం కూడా గుర్తుచేశారు. ఇన్ని చేసిన చంద్రబాబు అంటే మోడీ-షాలకు ఇష్టం లేదన్నారు. వైసీపీ బీజేపీని దూరం చేసేసుకుందన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి చంద్రబాబు, మోడీల్ని కలిపారన్నారు. రాబోయే రోజుల్లో మోడీ నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలని, జగన్ నాయకత్వంలో ఏపీ ముందుకు వెళ్లాలని ప్రసన్న తెలిపారు.












Click it and Unblock the Notifications