ఏపీలో కరోనా ఫ్రీ జిల్లాలివే - ఒక్క కేసూ నమోదు కాని వైనం.. అసలు కారణాలివేనా ?
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది. అయితే ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులుగా నిర్ధారించిన నెల్లూరు, విశాఖలో ఇద్దరు కోలుకున్నట్లు ప్రభుత్వం తాజా హెల్త్ బులిటెన్ లో స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర్రంలో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని జిల్లాలుగా నాలుగు జిల్లాలు రికార్డుల్లోకి ఎక్కాయి. దీనికి గల కారణాలేంటో ఓసారి చూసేద్దాం..

ఏపీలో కరోనా ఫ్రీ జిల్లాలివే..
ఏపీలోని వివిధ జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నా, పాజిటివ్ కేసులు నమోదవుతున్నా నాలుగు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అక్కడి అధికారులు, ప్రజలతో పాటు ప్రభుత్వంలోనూ సంతోషం నింపుతోంది. వీటిలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పశ్చిమగోదావరి, కడప జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా వ్యాప్తి కాకపోవడానికి కారణాలివే..
ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడానికి పలు కారణాలున్నాయి. ఇందులో ఓ కారణం ఈ నాలుగు జిల్లాల్లోనూ అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు లేకపోవడం. కడప జిల్లాల్లో దేశీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ రాకపోకలు అంతంత మాత్రమే. దీంతో విదేశాలతో పాటు దేశీయంగా కూడా సర్వీసుల ద్వారా ఇప్పటివరకూ ఇక్కడికి చేరుకున్న వారి సంఖ్య నామమాత్రమే.

కృష్ణా, గుంటూరు, విశాఖలోనే ఎక్కువ కేసులు..
ఏపీ విభజన తర్వాత అత్యంత రద్దీ ప్రాంతాలుగా మారిన నగరాలలో విజయవాడ, గుంటూరు, విశాఖఫట్నం ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడికి దేశీయంగా, అంతర్జాతీయంగా రాకపోకలు అధికమే. దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి ఈ నగరాలకు కనెక్టివిటీ కూడా ఎక్కువే. సాధారణ సమయాల్లో ఈ మూడు నగరాలకు లక్షల సంఖ్యలో జనం రాకపోకలు సాగిస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా లాక్ డౌన్ విధించిన తర్వాత కూడా విమానాలు లేకపోయినా వివిధ మార్గాల్లో ఈ నగరాలకు ప్రజలు రాకపోకలు ఎక్కువగా సాగించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 23 కేసులు నమోదైతే.. ఈ మూడు నగరాల్లోనే 14 కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం, తూర్పుగోదావరికి పరోక్షంగా..
రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల తర్వాత అత్యధికంగా మూడేసి కేసులు నమోదైంది ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోనే. దీనికి కూడా పరోక్ష కారణం పై మూడు జిల్లాలే. ఆయా జిల్లాల ద్వారా ఈ రెండు జిల్లాలకు ప్రయాణించిన వారే ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలో కేవలం ఐదు జిల్లాల్లోనే దాదాపు 90 శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన జిల్లాల్లో నమోదైన కేసుల సంఖ్య కేవలం 3 మాత్రమే.












Click it and Unblock the Notifications