అమ్మానాన్నలే వ్యభిచారం చేయమంటున్నారు: బాలికల వేదన, చలించిన జడ్జీ
కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే వారిపాలిట రాక్షసులుగా మారారు. ఏకంగా వ్యభిచారం చేయాలంటూ పిల్లలపై ఒత్తిడి చేశారు.
కడప: కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రులే వారిపాలిట రాక్షసులుగా మారారు. ఏకంగా వ్యభిచారం చేయాలంటూ పిల్లలపై ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ నలుగురు ఆడ పిల్లలు జిల్లా న్యాయమూర్తిని ఆశ్రయించి వారి వేదనను వివరించారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
తల్లిదండ్రులే..
జిల్లా జడ్జీ శ్రీనివాస్కు నలుగురు బాధిత బాలికలు రాసిన లేఖలో ఈ మేరకు వివరించారు. ‘మేము నలుగురం అక్కా చెళ్లెళ్లం. మేము బాగా చదువుకున్నాం. అయితే, మా అమ్మానాన్న మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు' అని తెలిపారు.
ఇద్దరికీ అక్రమ సంబంధాలు..
అంతేగాక, ‘మా అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అలాగే హమాలీగా పని చేసే మా నాన్న కూడా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు మమ్మల్ని కూడా వ్యభిచార రొంపిలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మాపై ఒత్తిడి తెస్తున్నారు' అని ఆ నలుగురు బాలికలు తమ ఆవేదనను వివరించారు.
బుద్ధి చెప్పండి సార్..
ఇంకా ‘ఇలాంటి జీవితం మాకు వద్దు. మేము బాగా చదువుకుని ప్రయోజకులం కావాలని ఉంది. మా అమ్మానాన్నలకి బుద్ధి చెప్పండి సార్' అంటూ జిల్లా న్యాయమూర్తిని ఆ నలుగురు బాలికలు వేడుకున్నారు.
చలించిపోయిన జడ్జీ
కాగా, ఈ లేఖ చదివిన జడ్జీ చలించి పోయారు. వెంటనే ఆ పిల్లల వివరాలు సేకరించాలని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ను ఆదేశించారు. సదరు తల్లిదండ్రులు, అక్రమ సంబంధం పెట్టుకున్నవారు, ఒత్తిడి చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయించారు. వెంటనే పిల్లలకు వారి నుంచి రక్షణ కల్పించాలని ఆదేశించారు.