రోజా భవిష్యత్తు నలుగురు సభ్యుల కమిటీ చేతికి...
హైదరాబాద్: ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా రాజకీయ భవిష్యత్తును నలుగురు సభ్యుల కమిటీ నిర్ణయించనుంది. రోజా సస్పెన్షన్పై, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విచారణ జరిపి, నివేదిక సమర్పించడానికి స్పీకర్ కోడెల శివప్రసాద రావు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు.
బుద్ధప్రసాద్ నేతృత్వంలోని ఈ కమిటీ సభ్యులుగా ముగ్గురిని నియమించారు. శ్రవణ్ కుమార్ (టిడిపి), శ్రీకాంత్ రెడ్డి (వైయస్సార్ కాంగ్రెసు), విష్ణుకుమార్ రాజు (బిజెపి) సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 20 రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

రోజా సస్పెన్షన్, భవిష్యత్తు చర్యలపైన కాకుండా శాసనసభలోని వీడియో టేపులు బయటకు ఎలా వచ్చాయనే విషయంపై కూడా కమిటీ విచారణ జరుపుతోంది. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ సరిపోతుందా, ఇంకా కఠిమైన చర్యలు ఏమైనా తీసుకోవాలా అనే విషయంపై కమిటీ సిఫార్సు చేస్తుంది.
అలాగే, రోజానే కాకుండా ఇంకా ఎవరైనా శాసనసభలో అనుచితంగా ప్రవర్తించారా అనే విషయాన్ని కూడా కమిటీ పరిశీలిస్తుంది. శీతాకాలం సమావేశాల్లో జరిగిన సంఘటనలపైనే కాకుండా వర్షాకాలం సమావేశాల్లో జరిగిన సంఘటనలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. వర్షాకాలం సమావేశాల్లో కూడా రోజా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై కూడా కమిటీ సూచనలు చేస్తుంది.












Click it and Unblock the Notifications