విశాఖ, కాకినాడ, రాజమండ్రి ప్రయాణికులకు రైల్వే అలర్ట్..!
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ అలర్ట్ ఇచ్చింది. గుల్లిపాడు స్టేషన్ పరిధిలో సాగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ స్టేషన్ల మధ్య ప్రయాణించే నాలుగు రైళ్లను (Trains) రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏ తేదీలో ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడుతుందో తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆగస్టు 8వ తేదీన విశాఖపట్నం నుంచి కాకినాడకు ప్రయాణించే రైలు నంబర్ (17268)ను రద్దు చేశారు. అదే రోజు కాకినాడ నుంచి విశాఖపట్నానికి వెళ్లే మరో రైలు నంబర్ (17267)ను కూడా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి రాజమండ్రికి ప్రయాణించే మరో రైలు నంబర్ (67286)ను కూడా రద్దు చేశారు. వీటితో పాటు రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి ప్రయాణించే మరో రైలు నంబర్ (67285)ను కూడా రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఈ రైళ్లు రద్దు చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో నిత్యం రాకపోకలు సాగించే ఈ నాలుగు రైళ్ల రాకపోకలకు ఆగస్టు 8న తాత్కాలిక బ్రేక్ పడుతున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెగ్యులర్ గా ఈ రైళ్లలో ప్రయాణించే వారికి ఆ రోజు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ఆగస్టు 9 నుంచి తిరిగి ఈ రైళ్లన్నీ యథావిథిగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications