భారీ వర్షం: మట్టిపెళ్లలు విరిగిపడి నలుగురు మృతి
విశాఖపట్నం: నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ వర్షానికి తడిసిన ఓ ప్రహారీ గోడ కూలడంతో పాటు మట్టి పెళ్లలు విరిగిపడటంతో దాని పక్కనే పని చేస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఓ భవన ప్రహారీ గోడ కూలింది. గోడతోపాటు భారీగా మట్టి పెళ్లలు కూలాయి. శిథిలాల కింద పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
నలుగురు మృతులను బయటికి తీశారు.

గురువారం ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహారీ గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పది అడుగుల లోతు ఉన్న గుంతలో ఆరుగురు కార్మికులు పని చేస్తుండగా ప్రమాదం సంభవించింది.
ఒక్కసారిగా ప్రహారీగోడ, దాని కింద ఉన్న మట్టిపెళ్లలు కుప్పకూలిపోయాయి. వీటి కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేశ్, సోమేష్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి, మరో ఇద్దరు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని కార్మికులు తెలిపారు.












Click it and Unblock the Notifications