హెరిటేజ్ ఎఫెక్ట్, ప్రజలదే తప్పంటారు, బాబు మళ్లీ మోడీ మెడలు వంచగలరా: కేవీపీ సవాల్
అమరావతి: విభజన చట్టం హామీల అమలులో జాప్యం నేపథ్యంలో ఏపీ ప్రజలు క్షమించరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు హితవు పలికారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖను మీడియాకు అందించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
చిరంజీవితో సంబంధం లేదని చెప్పిన కాసేపటికే.. పవన్ కళ్యాణ్పై రామ్ చరణ్ ఇలా!
చంద్రబాబు వైఖరి ఏపీకి శాపంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు విభజన హామీల అమలుపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబును ఏ శక్తి ఆపుతోంది
చంద్రబాబు బిగ్ బజార్ ద్వారా రద్దయిన పాత రూ.100, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ఇచ్చినంత ప్రాధాన్యత కూడా ఏపీ ప్రయోజనాల పరిరక్షణకు ఇవ్వలేదని కేవీపీ రామచంద్ర రావు ఆరోపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల సాధనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబును ఏ శక్తి ఆపుతోందని ప్రశ్నించారు.
ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా హెరిటేజ్, పోలవరం కాంట్రాక్టర్లు
ప్రధాని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన పూర్తి బడ్జెట్ను పార్లమెంటులో ప్రతిపాదిస్తోందని, ఈ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చేర్చుకోవటంలో చంద్రబాబు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత ఆయనను క్షమించదని కేవీపీ అన్నారు. చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా తన వ్యక్తిగత ప్రయోజనాలు, హెరిటేజ్ ప్రయోజనాలు, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాల గురించి చర్చిస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు చర్చించరన్నారు.
ప్రతివాదులుగా ఎవరిని చేరుస్తారు
పోలవరం కాంట్రాక్టర్ల ప్రయోజన పరిరక్షణ కోసమే ఎన్డీయే ప్రభుత్వంతో గొడవ పడుతున్నారు తప్ప విభజన హామీలకోసం కాదని కేవీపీ విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తానని హెచ్చరిస్తున్న చంద్రబాబు తన పిటిషన్లో ప్రతివాదులుగా ఎవరిని పేర్కొంటారని ప్రశ్నించారు. విభజన జరిగి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నది, ఈ కాలంలో చంద్రబాబు సాధించిందేమిటని నిలదీశారు.
తన అవసరాలు తీరడం లేదని కేంద్రంపై దాడి
పెద్ద పెద్ద మాటలు చెప్పే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కటం ద్వారా రాష్ట్ర యువతకు అన్యాయం చేస్తున్నారని కేవీపీ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించారని ఇప్పుడు తెలుసుకోవటం ఏమిటన్నారు. కేంద్రం రాష్ట్రాన్ని అదుకోవటం లేదని చంద్రబాబు ఆరోపించటాన్ని కేవీపీ ఖండించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, తన అవసరాలు తీరటం లేదు కాబట్టే కేంద్రంపై దాడికి దిగుతున్నారన్నారు.
మీరు ఉద్యమించనందునే.. ప్రజలనే బాబు తప్పుబడతారు
ఇప్పుడు కేంద్రాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు రేపు ఏపీ ప్రజలను తప్పుపడతారు, మీరు ఉద్యమించలేదు కాబట్టే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రాలేదనే ఆరోపణలు చేస్తారని కేవీపీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో నాగపూర్కు వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల రేటు గురించి మాట్లాడటం ఏమిటన్నారు. పోలవరం నిర్మాణం గురించి చర్చించాల్సింది పోయి అలా చేయడం ఏమిటన్నారు.
మళ్లీ మోడీ మెడలు వంచగలరా
పోలవరం ప్రాజెక్టుకోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ప్రధాని మోడీ మెడలు వంచానని చంద్రబాబు చెప్పుకుంటారని, ఇదే నిజమైతే ప్రత్యేక ప్యాకేజీ సాధించేందుకు మరోసారి మోడీ మెడలు వంచగలరా అని సవాల్ చేశారు. ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర హామీల సాధనకు కేంద్రం ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదని ప్రశ్నించారు. పోలవరం వాటాల గురించి అడుగుతారని భయపడుతున్నారా? అని కేవీపీ ప్రశ్నించారు.
ప్రశ్నల వర్షం
అమరావతిలో వందలు, వేల ఎకరాల భూమిని పప్పుబెల్లాల మాదిరి పంచి పెట్టటం గురించి కేంద్రం ప్రశ్నిస్తుందని భయపడుతున్నారా? అని కేవీపీ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఏపీకి శాపంగా మారిందన్నారు. విభజన చట్టం మూలంగా ఏపీకి ఇచ్చిన పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను రానున్న బడ్జెట్లో పొందుపరిచేలా కేంద్రంపై ఒడ్తితి తీసుకు రావాలని, లేకుంటే బాబును చరిత్ర క్షమించదన్నారు. ఇకనైనా చంద్రబాబు కుటుంబ ప్రయోజనాలు, హెరిటేజ్ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల సాధనకు, విభజన చట్టం హామీల అమలుకు కృషి చేయాలని హితవు చెప్పారు. ఇది విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక అని కేవీపీ అన్నారు.