ఐఏఎస్ నవీన్ కుమార్ స్ఫూర్తితో: కాకినాడలో కేన్సర్ స్క్రీనింగ్ కోసం ఉచిత వైద్య శిబిరం..!!
మానవ సేవే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో ఉన్న ఇతరులను ఆదుకుంటే మనసుకు వచ్చే తృప్తే వేరు. అలాంటిది చేతిలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నలుగురికి నాలుగు రకాలుగా సహాయపడితే జీవితం ధన్యం అవుతుంది. ఈ రోజుల్లో అలాంటి వారు తక్కువగానే కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరు మనం చెప్పుకోబోయే ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్. నవీన్ కుమార్ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీగా 2021 అక్టోబర్ నుంచి జనవరి 2023 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఇంతకీ ఈ ఐఏఎస్ అధికారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసా..?
ఏపీ ఆరోగ్య శాఖపై ప్రత్యేక ముద్ర
నవీన్ కుమార్ ఐఏఎస్. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వైద్య రంగంలో క్యాన్సర్ ఒక మహమ్మారి. క్యాన్సర్ జబ్బు వచ్చిందంటే దానికి అయ్యే ఖర్చు సామాన్యుడు భరించలేడు. ఆస్తులు అమ్మి చికిత్స చేసుకున్నప్పటికీ బతుకుతాడన్న గ్యారెంటీ లేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్, ఈ వ్యాధిని ఆదిలోనే అంతం చేయాలని భావించారు. క్యాన్సర్ తొలి దశలోనే ఉండగా గుర్తించి చికిత్స చేయిస్తే జబ్బు నయం కాగలదని ప్రగాఢంగా నమ్మిన వ్యక్తి నవీన్ కుమార్. అయితే క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ఇంతపెద్ద రాష్ట్రంలో గుర్తించడం కష్టమైన పని.

ఇందుకోసం చక్కటి ఆలోచనతో వచ్చి ఏపీ ప్రభుత్వం సహకారంతో ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాంను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఈ కార్యక్రమం ద్వారా విలేజ్ క్లినిక్స్ను ఏర్పాటు చేసి నెలకు రెండు సార్లు నడవలేక మంచానికే పరిమితమైన పేషంట్ల ఇళ్లకే వెళ్లి మెడికల్ సిబ్బంది వారికి సేవలను అందించేది. ఇందుకోసం 2400 మంది మెడికల్ ఆఫీసర్లను నియమించుకుని ఏపీ హెల్త్ యాప్ ద్వారా పేషెంట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా చర్యలు తీసుకున్నారు.

ఇక ఏపీలో కేన్సర్ వ్యాధిని అధికారికంగా గుర్తించి నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ద్వారా సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. యుద్ధప్రాతిపదికన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్స్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన హోమి భాభా కేన్సర్ హాస్పిటల్తో జతకట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా కేన్సర్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేశారు.ఇక కేవలం కేన్సరే కాదు.. కాలేజీల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆరోగ్యశాఖ స్పెషల్ సెక్రటరీగా నవీన్ కుమార్ చూపిన చొరవతో వైద్యం అతి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఆరోగ్య వ్యవస్థను డిజిటల్ పద్ధతిలోకి తీసుకురావడంలో ఈయన కృషి చాలా ఉంది. అందుకే ఆరోగ్య రంగంలో నవీన్ కుమార్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ కేంద్రం పలు అవార్డులతో సత్కరించిది.
అందరికీ స్ఫూర్తిగా నిలిచిన నవీన్ కుమార్
ఇక నవీన్ కుమార్ ఉత్తర్ ప్రదేశ్కు బదిలీ అయ్యారు. అయితేనేం. ఆయన ఏపీ ఆరోగ్య వ్యవస్థపై వేసిన ముద్ర చాలా మందిలో స్ఫూర్తి నింపింది. కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేన్సర్ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేందుకు ఉచిత శిబిరాలను ఏర్పాటు చేసి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా ఏఐసీసీ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల డిసెంబర్ 9వ తేదీన, కాకినాడ రూరల్ చీడిగలో ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో ట్రినిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ ఏఐసీసీ జిల్లా శాఖ అధ్యక్షుడు జాన్ రిక్కీ గూటం తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం ఉంటుందని వెల్లడించారు. ఈ శిబిరంలో బ్రెస్టు,సర్వైకల్,డెంటల్, కళ్లు, గర్భాశయం,జనరల్ వైద్య నిపుణులు అందుబాటులో ఉండి పరీక్షలు చేస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9848978506,9849622454 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
"మా రాష్ట్రాన్ని వీడినప్పటికీ మాలో స్ఫూర్తి నింపి వెళ్లావు. నా జీవితంలోకి నీలాంటి వ్యక్తిని పంపిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనెల 10,000 స్క్రీనింగ్లు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం" అంటూ బ్రదర్ రిక్కీ గూటం పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications