మళ్లీ పెరిగిన పెట్రో ధరలు - 10 రోజుల్లో తొమ్మిదోసారి..!!
సామాన్యులపైన పెట్రో ధరల భారం పెరుగతూనే ఉంది. గడిచిన 10 రోజుల వ్యవధిలో వరుసగా తొమ్మిదోసారి ధరలు పెరిగాయి. నిత్యం పెరుగుతూ పోతున్న పెట్రో ధరలతో నిత్యావసర ధరలు సైతం భగ్గుమంటున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్దం ప్రభావంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇదే విషయాన్ని అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయిన రోజునే ప్రధాని చెప్పుకొచ్చారు. ఇక, యుద్దం తో పాటుగా అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత ఒక్క సారిగా సిలిండర్ ధర రూ 50 పెరిగింది.
అదే సమయంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మరో సారి ఇంధన ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్, డీజిల్పై 80పైసల చొప్పున పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్ ధర రూ.93.07కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్లో లీటర్ పెట్రోల్ రూ.117.32, డీజిల్ రూ.103.10కి చేరింది. హైదరాబాద్లో పెరిగిన ధరల అనంతరం లీటర్ పెట్రోల్ రూ.115.42, డీజిల్ రూ.101.58గా ఉంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటంతో పరోక్షంగా అన్నింటి పైనా ప్రభావం చూపుతోంది.