బాబూ! ఈ లెక్క సరిపోతుందా, మళ్లించలేమనేనా.. చేతగాని వాళ్లమని చెప్పడమేనా?: బాబు వర్సెస్ షా
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాసిన లేఖ, దానికి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. మీ ఆర్థిక డిమాండ్లు అసంబద్దమని, స్వప్రయోజనాలే మీ అజెండా అని, అందుకే ఎన్డీయే నుంచి వైదొలిగారని, ఏపీ ప్రయోజనాల కోసం నిధుల నిమిత్తం స్పెషల్ పర్సస్ వెహికిల్ పెడితే నిధులను మళ్లించడం కష్టమనే అంగీకరించలేదా అని షా ఘాటైన లేఖ రాశారు.
బాబు యూటర్న్, ఇవి ఎక్కడ?: అమిత్ షా జగన్ ఆశ్చర్యం, 'పవన్! నువ్వు అక్కడ లేవుగా'
దానికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ మోసం చేసిందని, ఆ లేఖలో అన్నీ అసత్యాలు, అబద్దాలు అని ధ్వజమెత్తారు. ఇది తనకు మాత్రమే కాదని, ఏపీ ప్రజలకు అవమానం అన్నారు. అమిత్ షా తొమ్మిది పేజీల లేఖ రాయగా, అందులోని ప్రతి అంశాన్నికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఈ లేఖ రాష్ట్రాన్ని కించపరిచేలా, రెచ్చగొట్టేలా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం చేతగానిదిగా చెప్పడమే ఆయన ఉద్దేశ్యమన్నారు.
చంద్రబాబు గారూ! ఈ లెక్క సరిపోతుందా
ప్యాకేజీ విషయంలో చంద్రబాబు తొలుత అంగీకరించి రెండేళ్ల తర్వాత యూటర్న్ తీసుకున్నారని అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు. ఖర్చు వివరాలు ఇవ్వకుండా అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారన్నారు. తమపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద నాబార్డు ద్వారా నిధులు పొందేందుకు వీలుగా స్పెషల్ పర్సస్ వెహికిల్ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు నిధులు ఇస్తున్నా వాటివల్ల మీ ప్రభుత్వం మాత్రమే ప్రయోజనం పొందేలా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.1,17,967 కోట్లు అందితే మా హయాంలో 107 శాతం పెరుగుదలతో 2,44,271 కోట్లు అధిగంగా ఇస్తున్నామన్నారు. కేంద్రం బాధ్యతతో ఉందని చెప్పేందుకు ఈ అంకెలు సరిపోతాయా చంద్రబాబుగారూ అని ప్రశ్నించారు.
కడిగిపారేసిన అమిత్ షా, చంద్రబాబు కౌంటర్
లోటు భర్తీ విషయంలో టీడీపీ వాదన సరికాదని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.1050 కోట్లు విడుదల చేస్తే అందులో 12 శాతం వాడుకొని 88 శాతం వాడుకోకపోవడం మీ అసమర్థత కాదా అని టీడీపీని కడిగిపారేశారు. రాజధాని కోసం ఇచ్చిన నిధుల్లో కేవలం 8 శాతమే వినియోగించుకుందన్నారు. అమిత్ షా లేఖపై చంద్రబాబు సభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రతి పాయింట్ చదివి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సోనియా, మన్మోహన్ ఫోటోలు
కేంద్రం ఇచ్చే నిధుల కార్యక్రమాలు తమవే అన్నట్లుగా కేవలం టీడీపీ ప్రభుత్వమే ప్రచారం చేసుకుందన్న అమిత్ షా అభిప్రాయంపై చంద్రబాబు మాట్లాడుతూ.. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ లేదా సోనియా గాంధీ ఫోటో పెట్టారా అని అడిగారు. అయినా మీదో పార్టీ, మాదో పార్టీ అన్నారు. డబ్బులు ఇస్తున్నారని మీరు చెప్పినట్లు చేయాలా అన్నారు. కాగా, చంద్రబాబు ఇక్కడే మిత్రధర్మం మరిచారని బీజేపీ నేతలు ఆంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఒకరి ఫోటోలు మరొకరు పెట్టుకోకపోవడం వేరు.. బీజేపీ -టీడీపీలు మిత్రపక్షాలను గుర్తు చేస్తున్నారు.
లెక్కలు చెప్పలేదనడంపై
లెక్కలు చెప్పలేదనడంపై చంద్రబాబు స్పందిస్తూ.. విభజన తర్వాత ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి, రాజ్యసభలో ఇచ్చిన హామీలపై నిధులు పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని, ఇచ్చిన నిధులకు సంబంఎధించి రూ.11,592 కోట్లకు వినియోగ పత్రాలు ఇచ్చామని, వెనుకబడిన ప్రాంతాలకు 12 శాతం, రాజధానికి 8 శాతం మాత్రమే ఖర్చు చేశామని చెబుతున్నారని, అధికారం ఉంది కదా అని ఏది పడిదే అది మాట్లాడితే ఎలా అన్నారు.
వైసీపీని నమ్మితే అంతే
వైసీపీని నమ్మితే మీకు అదే గతి అని చంద్రబాబు బీజేపీని హెచ్చరించారు. ప్రజల్ని మోసం చేయొచ్చని వైసీపీ వాళ్లు చెప్పారని, మీరు నమ్మారని, అప్పట్లో కాంగ్రెస్కూ అలాగే చెప్పారని, ఆ తర్వాత వాళ్లిద్దరు పోయారని, ఇప్పుడూ మీ దగ్గర చేరారని, విజయసాయి రెడ్డి నేనిక్కడే ఉంటానని, ప్రధాని కార్యాలయంలోనే ఉంటానని, పదే పదే కలుస్తారని, కేసులు పెట్టిస్తా అంటున్నారని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి, బెయిల్పై ఉన్న వారు ప్రధానిని పదేపదే కలిస్తే ఏమనుకుంటారని ప్రశ్నించారు. అయితే, జగన్ లేదా విజయసాయి రెడ్డి ప్రజాప్రతినిధులు అనే విషయం టిడిపి మరిచిపోతుందని వైసీపీ అంటోంది.
నేను తొందరపడలేదు
కేంద్రం నుంచి వైదొలగే విషయంలో తాను తొందరపడ్డానని చెబుతున్నారని, కానీ నేను తొందరపడలేదని చంద్రబాబు అన్నారు. ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామని, 29 సార్లు తిరిగి తన ప్రయత్నాలు తాను చేశానని, అయిదో బడ్జెట్లోను న్యాయం కనిపించలేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల కింద ఆదాయాన్ని పొందుతున్న కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు.