విశాఖ వేదికగా జీ-20 సన్నాహక సదస్సు: తేదీలు, అజెండా ఫిక్స్!!
జీ-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ సంవత్సరం డిసెంబరు నెల నుంచి వచ్చే సంవత్సరం నవంబరు నెల వరకు సన్నాహక సదస్సులతోపాటు, వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో సన్నాహక సదస్సులు నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక జీ-20 సన్నాహక సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. దేశంలోని 56 నగరాలు, పట్టణాలలో మొత్తం వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి విశాఖపట్నాన్ని జీ 20 సన్నాహక సదస్సుకు ఎంపిక చేశారు.
విశాఖ వేదికగా జీ-20 సన్నాహక సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే తేదీలను ఖరారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3, 4 మరియు 24 వ తేదీలలో విశాఖలో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విశాఖలో జరిగే ఈ మూడు రోజుల సదస్సులో వ్యవసాయం, ఆర్థిక రంగం, విద్య, వైద్యం అంశాలపై 37 సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే జీ-20 సన్నాహక సదస్సుకు నోడల్ అధికారిగా ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం బాల సుబ్రహ్మణ్యం రెడ్డి ని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డిజిపిని నియమించారు.
ఇక ఈ సదస్సులకు వేలాది మంది విదేశీ, స్వదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. విశాఖ వేదికగా జరగనున్న ఈ సన్నాహక సదస్సులో వివిధ దేశాల ఆర్థిక మంత్రులు విదేశాంగ మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు పాల్గొంటారని సమాచారం. దీనికి తగ్గట్టుగా విశాఖ కేంద్రంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సు నిర్వహణకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేసి, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఇక విశాఖ నగరానికి వచ్చిన అతిథుల కోసం నగరంలో ఉన్న స్టార్ హోటళ్లలో విడిది ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 703 గదులను రిజర్వు చేయడానికి చర్యలు చేపట్టారు. అంతేకాదు విశాఖ నగరానికి వచ్చే అతిథులు నగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫోర్బ్స్ 2022 జాబితా: వరుసగా నాలుగోసారి శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్!!