ఏపీ అసెంబ్లీలో జీవో నెంబర్1 రచ్చ: టీడీపీతీరుపై విడదల రజినీతో పాటు మంత్రులు ఫైర్
AP అసెంబ్లీలో జీవో నెంబర్ 1 పై రగడ కొనసాగింది. టీడీపీ దాడిపై విడదల రజినీతో పాటు వైఎస్సార్సీపీ మంత్రులు ఫైర్ అయ్యారు. సభలో దాడి చేయడం దారుణమని అన్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జీవో నెంబర్ ఒకటి పైన తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగడంతో అసెంబ్లీ వేదికగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం, ఇద్దరూ ఒకరిపై ఒకరు తలపడిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి సభ్యులపై టిడిపి నేతలు దాడి చేశారంటూ వైసిపి మంత్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు.
వైసిపి మంత్రి విడదల రజిని తెలుగుదేశం పార్టీ సభ్యులకు సంస్కారం లేదని సభలో టిడిపి సభ్యులు రౌడీయిజం చేశారని, ప్లాన్ ప్రకారమే వచ్చి అతి చేశారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారని, తెలుగుదేశం పార్టీ మారణకాండను అడ్డుకోవడం కోసమే జీవో నెంబర్ 1ని తీసుకువచ్చినట్టుగా మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

స్పీకర్ పై టిడిపి సభ్యులు భౌతికంగా దాడి చేశారని, టిడిపి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. అంతే కాదు అప్రజాస్వామికంగా టిడిపి వ్యవహరిస్తుందని మంత్రి పెనిపే విశ్వరూప్ తెలిపారు. సభలో గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టిడిపి సభ్యులు అసెంబ్లీ మార్షల్స్ పైన కూడా దాడి చేశారని నిప్పులు చెరిగారు.
చంద్రబాబుది దాడుల చరిత్ర అంటూ మండిపడ్డారు. బీసీలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు ఉందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
సభలో టిడిపి సభ్యులు తీరు బాధాకరమని, చంద్రబాబు సభకు రాకుండా దాడులు చేయిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. స్పీకర్ అంటే చంద్రబాబుకు, టిడిపి సభ్యులకు గౌరవం లేదని పేర్కొన్న ఆయన టిడిపి సభ్యుల తీరు బాధాకరమన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబుకు దాడులు చేయించడం అలవాటని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టిడిపి సభ్యులు తనపై దాడి చేశారని, సభాపతిని కూడా టిడిపి సభ్యులు అవమానించారని తనపై దాడి చేసిన టిడిపి సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలని ఎమ్మెల్సీ ఎలీజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications