చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు జనం లేక ఫ్రస్ట్రేషన్ లోనే: విరుచుకుపడిన గడికోట శ్రీకాంత్ రెడ్డి
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం పర్యటనలో జనం లేకపోవడంతో చంద్రబాబుకు ప్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్లిందని, అందుకే దిగజారి ఉన్మాద భాష మాట్లాడారని గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వజమెత్తారు.
ప్రజలకు సంక్షేమం అందుతుంటే చంద్రబాబుకు ఆక్రోశం వస్తుంది
వైసిపి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని, ప్రజలకు సంక్షేమం అందుతుంటే చంద్రబాబుకు ఆక్రోశం వస్తుందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం వైసీపీ ప్రజా ప్రతినిధులు వివరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరతీశారు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము కుల మత ప్రాంతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందిస్తుందని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
జగన్ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి నేరుగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. అలాగే ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లారని వెల్లడించారు. చంద్రబాబు కుప్పంలో ఏడు సార్లు గెలిచిన, కుప్పం నియోజకవర్గంలో సమస్యలు తీర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
పుత్ర రత్నం నారా లోకేష్ 12 కేసులు ఉంటే రండి అంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు
ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాము చంద్రబాబులాగా విడగొట్టి సంక్షేమాన్ని నిర్వీర్యం చేయలేదని పేర్కొన్నారు. తాను చేయలేనిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు అని మండిపడ్డారు. నిస్సిగ్గుగా అక్రమాలు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని, ఇక చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్ 12 కేసులు ఉంటే రండి అంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబు నిర్దోషి అయితే తనపై ఉన్న కేసుల స్టేలను ఎత్తి వేయించి విచారణకు సిద్ధమా?
ఇక చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను విన్న ప్రజలు విస్తుపోతున్నారు అని పేర్కొన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి, నారాయణ విద్యా సంస్థలు నారాయణవి కాదు అంటే ప్రజలు షాక్ కు గురయ్యారని వెల్లడించారు. తప్పు చేస్తున్న వారిని శిక్షిస్తే కక్ష సాధింపు చర్యలు అని ఎదురుదాడికి దిగుతున్నారు అంటూ విమర్శించారు. ఏకంగా ముఖ్యమంత్రి సమీప బంధువైనా తప్పు చేస్తే శిక్ష పడిందని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ చంద్రబాబు హయాంలో తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చి రాజీ పంచాయితీలు చేశారంటూ విమర్శించారు. చంద్రబాబు నిర్దోషి అని భావిస్తే తనపై ఉన్న కేసుల స్టేలను ఎత్తి వేయించి విచారణకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.