వైఎస్ జగన్కు కేంద్రమంత్రి షెఖావత్ విజ్ఞప్తి: అందులో భాగస్వామిగా వైసీపీ: ఆటలో అరటిపండు
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఫోన్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎన్టీఏ ఉమ్మడి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ఆయన అప్పీల్ చేశారు. ఆమె గెలుపులో వైఎస్ జగన్, పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ సభా పక్ష నేత, పార్టీ ఎంపీలు భాగస్వామ్యం కావాలని కోరారు.
కొద్దిసేపటి కిందటే గజేంద్ర సింగ్ షెఖావత్ ఢిల్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ద్రౌపది ముర్మును గెలిపించాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కోరుతున్నానని చెప్పారు. దేశ రాజకీయాల్లో తటస్థంగా ఉంటోన్న వైఎస్ఆర్సీపీకీ అప్పీల్ చేశానని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఇతర నాయకులు పాల్గొన్నారని షెఖావత్ చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా వైసీపీ ఓటు వేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
అంతకుముందు- తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో కూడా మాజీ మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైఎస్ జగన్కు ఫోన్ చేసి, మద్దతు కోరారని అన్నారు. దీనితోపాటు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా వైఎస్ జగన్కు ఫోన్ కాల్ వచ్చిందని పేర్కొన్నారు.
ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపర్చడానికి అవసరమైన సంతకాలు చేయడానికి ఢిల్లీ రావాలంటూ ఆహ్వానించారని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతును బీజేపీ కోరలేదంటూ వస్తోన్న వార్తల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తలను పుట్టించి, ప్రచారం చేస్తోన్న వాళ్లందరూ ఆటలో అరటిపండుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఈ వార్తలను పుట్టించిన వారి అవసరం దేశానికి లేదని చెప్పారు.