హైద్రాబాద్లో ఆస్తులూ వదిలేయాలా: గాలి, కేంద్రంపై మళ్లీ టీడీపీ.. కేఈ ఫైర్
విజయవాడ: తాము హైదరాబాదులోని భవనాలు వదిలి పెట్టి వెళ్తున్నామని, ఆస్తులు కూడా వదిలి వెళ్లాలా అని టిడిపి నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆదివారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల పైన ఇరు రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పారు.
పులిచింతల ప్రాజెక్టు పైన తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులు నిర్మించాలని సూచించారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, దానిని ఇప్పుడు వ్యతిరేకించడం విడ్డూరమన్నారు.

కేంద్రం నిధులివ్వాలి: కేఈ
నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి సరిపోయేలా కేంద్రం నిధులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం నాడు డిమాండ్ చేశారు. అభివృద్ధికి సరిపడా నిధులు ఇవ్వకుండా కేంద్రం అవమానిస్తోందని మండిపడ్డారు.
అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సరైన నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కర్నూలులో టిడిపి జిల్లా కార్యాలయంలో సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేఈ, ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేఈ వ్యాఖ్యలతో మరోసారి టిడిపి వర్సెస్ బిజెపిగా మారనుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications