పవన్! ఆ మాటెలా అంటారు?: గల్లా, గంటా, అయ్యన్నలకు చంద్రబాబు క్లాస్!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. విశాఖపట్నానికి రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్ నాథ్ దీక్ష ప్రారంభించడం, దీక్షకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించిన తరుణంలో జిల్లాకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడులను చంద్రబాబు మందలించినట్టు తెలుస్తోంది.
నెల రోజుల క్రితమే అమర్ నాథ్ దీక్ష గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించిన చంద్రబాబు.. దీక్ష చేసే వరకూ ఎందుకు రానిచ్చారని మందలించారట. ఇప్పుడు ఏం చేసినా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని, జిల్లా వ్యవహారాలను గాలికి వదిలేశారని చంద్రబాబు క్లాస్ పీకినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసలు దీక్షకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇప్పుడిక ఏమీ చేయలేమని, వదిలిపెడితే, జోన్ రాకపోవడానికి కారణం ప్రభుత్వమేనన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని చంద్రబాబు అన్నట్టు సమాచారం. జోన్ వస్తుందన్న సెంటిమెంటుతో ఉన్న ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిసింది.
పవన్ కళ్యాణ్ ఆ మాటెలా అంటారు: గల్లా
తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ఆ మాటెలా అంటారని ప్రశ్నించారు.
తాను స్వయంగా పవన్ను కలిసి అభివృద్ధి ఎలా జరుగుతున్నదో, తామెలా కష్టపడుతున్నామో తెలియజేస్తానని అన్నారు. 2019లో జరిగే ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీతో కలిసుంటామని చెప్పారు.
అయితే, ఆ తర్వాత ఏమవుతుందో చెప్పలేనని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్ముతున్నామని, కేంద్రం నుంచి విడతల వారీగా నిధులు అందుతూనే ఉన్నాయని అన్నారు.