చంద్రబాబు విషం: గండ్ర, అది అడ్డుకాదన్న కోదండ
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విష కక్కుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు చంద్రబాబే డిమాండ్ చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా అడ్డుకుంటామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. గతంలో తెలంగాణపై చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏమని ప్రకటించారో గుర్తుకు తెచ్చుకోవాలని గండ్ర అన్నారు. తమ లక్ష్యం ముఖ్యమంత్రి మార్పు కాదని, తెలంగాణ ఏర్పాటేనని వెంకటరమణారెడ్డి తేల్చి చెప్పారు.
విభజనకు 371 అడ్డు కాదు: కోదండరాం
మహబూబ్నగర్ష్ట్: విభజనకు 371 డి ఆర్టికల్ అడ్డుకాబోదని తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం అన్నారు. విభజన పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవివేకంగా వ్యవహరిస్తున్నాని ఆరోపించారు. జిల్లాలోని గద్వాల్లో జరిగి కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యదర్శితో కుట్రపన్ని బిల్లును అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 371డికి, ఆర్టికల్ 3కి సంబంధం లేదని కోర్టు తీర్పు తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట్లాడటం అవివేకమేనని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరిపి వారం రోజుల్లో పార్లమెంటుకు పంపాలని కోదండరాం డిమాండ్ చేశారు.
చంద్రబాబు తప్పించుకుంటాడు: విద్యాసాగర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పించుకోవడం ఖాయమని అన్నారు.
రెండు మూడు రోజుల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించి రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చొరవ చూపాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యార్థం ఆదివారం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యూనిటీ ప్రారంభమవుతుందని చెప్పారు.
కిరణ్ చీప్ మినిస్టర్ లా వ్యవహరిస్తున్నారు: శ్రవణ్
తెలుగువారి ఆత్మగౌవరం గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ జగన్మోహన్ రెడ్డికి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మూర్ఖంగా, చీప్ మినిస్టర్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు జలగల్లా పీడిస్తున్నారని విమర్శించారు. 371డిపై కిరణ్ కుమార్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.