బెజవాడలో గ్యాంగ్వార్: కత్తులు, రాళ్ల దాడులతో రెచ్చిపోయిన విద్యార్థులు, ఒకరు మృతి
అమరావతి: విజయవాడలో కాలేజీ విద్యార్థులు వీధి రౌడిల్లా రెచ్చపోయారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్ల దాడులతో వీరంగం సృష్టించారు. పడమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.
ఈ దాడులతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. కాగా, ఈ గ్యాంగ్వార్లో రాజకీయ పార్టీల నేతల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థుల ఘర్షణకు యనమలకుదురులోని రూ. 2 కోట్ల విలువైన భూమి కారణమని తెలిసింది.
ల్యాండ్డీల్కు సంబంధించి రెండు గ్రూపులు జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు గ్రూపులకు చెందిన సుమారు 30 మందికిపైగా కాలేజీ విద్యార్థులు కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Recommended Video
కాగా, ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్ ఒకరు జోక్యం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం కూడా ఉందని వార్తలు వస్తుండటంతో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.