గన్నవరం వైసీపీ వర్గ పోరు తీవ్రం- వంశీ అద్దె ఎమ్మెల్యే అన్న యార్లగడ్డ- జగన్ను తిట్టలేదా అని ప్రశ్న
కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ మూడు ముక్కలాట కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన వంశీని పార్టీలోకి తీసుకురావడంపై సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు భగ్గుమంటుండగా.. ఇప్పుడు మరో నేత, మొన్నటి ఎన్నికల్లో వంశీపై పోటీ చేసిన ఓడిన యార్గగడ్డ వెంకట్రావు సైతం వంశీపై విమర్శలకు దిగారు. పార్టీలోకి దొడ్డి దారిన వచ్చి మా కార్యకర్తల్ని వేధిస్తావా అంటూ వంశీపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో వంశీ గెలిచిన తీరుపై, ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న వైఖరిపై యార్గగడ్డ చేసిన విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ నేతల్ని కాదని విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న జగన్ వైఖరి దీంతో మరోసారి ప్రశ్నార్ధకమైంది.
సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..
500 దొంగ ఓట్లతో గెలిచావ్...
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆయన తీరుపై సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు పలుమార్లు విరుచుకుపడుతుండగా.. తాజాగా ఇదే నియోజకవర్గంలో వంశీపై పోటీ చేసిన ఓడిన యార్గగడ్డ వెంకట్రావు సైతం ఇదే బాట ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ రూరల్లోని రామవరప్పాడు, ప్రసాదం పాడు గ్రామాల్లో వంశీ 500 దొంగ ఓట్లతో గెలిచారని.. తాను వైసీపీ కోసం కష్టపడిన అసలైన నాయకుడిని అని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. తన ప్రయోజనాల కోసం అద్దెకు వచ్చిన నాయకుడు వంశీ అని యార్గగడ్డ అన్నారు. 1200 దొంగ పట్టాలు పంచిపెట్టి, మట్టి అమ్ముకుని, చందాలు వసూలు చేసి గెలిచిన నాయకుడు వంశీ అంటూ విరుచుకుపడ్డారు.
అద్దె ఎమ్మెల్యే వంశీ వేధింపులా ?
పదేళ్లుగా వైసీపీ కోసం కష్టపడిన కార్యకర్తలపైన అద్దెకు వచ్చిన ఎమ్మెల్యే వంశీ కక్షపూరితంగా వేధింపులకు పాల్పడుతున్నారని యార్గగడ్డ ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడి చేయాలంటే నన్ను దాటి వెళ్లాలి గుర్తుంచుకో అంటూ యార్లగడ్డ సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో ఉండగా అరాచకాలు చేసింది చాలక, ఇప్పుడు వైసీపీలో మరోసారి అరాచకాలు చేయడానికి వచ్చాడని, వాటిని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించబోమని కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కూడా అయిన యార్లగడ్డ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వంశీకీ, యార్లగడ్డకు మధ్య విభేదాలు ఏ స్ధాయిలో ఉన్నాయో మరోసారి బయటపడినట్లయింది. పార్టీ సీనియర్ల రాజీతో ప్రస్తుతం కామ్గా ఉంటున్నా కార్యకర్తల గొడవలతో ఈ వివాదాలు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్, భారతిని ఎన్ని తిట్టావ్ ?
గతంలో గన్నవరంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు ఆయనపై ఎన్ని దుర్భాషలాడారో అందరికీ తెలుసని యార్లగడ్డ వ్యాఖ్యానించారు. అప్పట్లో భారతిని కూడా వదిలిపెట్టలేదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చే సరికి లోపలికి వచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తూ కార్యకర్తలపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని వంశీపై యార్గగడ్డ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తద్వారా వంశీకి వ్యతిరేకంగా ఉన్న దుట్టాను కూడా ఈ వివాదంలోకి లాగినట్లయింది. గతంలో తన వర్గం కార్యకర్తలను వంశీ టార్గెట్ చేస్తున్నారని దుట్టా ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు యార్లగడ్డ కూడా ఇవే ఆరోపణలు చేయడంతో వంశీ విషయంలో వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Recommended Video
ఇలాంటి వెధవతో పనిచేయనని జగన్కే చెప్పాను...
గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ మట్టే కాదు ఏదైనా అమ్మేస్తాడని యార్గగడ్డ విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వస్తుంటే పోలీసులు ఆరుసార్లు అడ్డుకున్నారని, ఇదంతా ఎవరు చేయించారో తనకు తెలుసని వంశీని ఉద్ధేశించి యార్లగడ్డ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాడు వైసీపీలో ఉంటే పార్టీకి మచ్చ అని యార్లగడ్డ అన్నారు. జగన్ గతంలో వంశీతో కలిసి పనిచేయమంటే అలాంటి వెధవతో కలిసి పనిచేయలేనని చెప్పేశానని యార్లగడ్డ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తన వైఖరి అదేనని యార్గగడ్డ చెప్పుకొచ్చారు. ఇప్పటికే టీడీపీ నుంచి తెచ్చుకున్న వంశీతో కలిసి పనిచేయాలని సీనియర్ నేత దుట్టాతో పాటు యార్లగడ్డకు కూడా జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా వివాదాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.