ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ ఘటన .. విశాఖలో సీఎం జగన్ షెడ్యూల్ ఇదే
అసలే రాష్ట్రం కరోనాతో అతలాకుతలం అవుతుంటే ఎల్జీ పాలిమర్స్ లో ఈ తెల్లవారు జామున జరిగిన ప్రమాదం ఏపీని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. విశాఖపట్నం లోని గోపాలపట్నం లో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ లో గ్యాస్ లీకేజ్ కారణంగా సమీప గ్రామాల ప్రజలు వేలాది మంది ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతి పెద్ద ప్రమాదం జరగటంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అధికారులకు తక్షణ ఆదేశాలు అందించింది. బాధితులకు ఎంత ఖర్చైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే సరైన వైద్య సేవలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు . హుటాహుటిన విశాఖ బయలుదేరుతున్నారు .
ఉదయం 11:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా విశాఖ పయనం .. పరిస్థితి సమీక్షించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 11:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు . అక్కడ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ఎపి పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శిస్తారు . బాధితులను కలిసిన తరువాత అక్కడ తీసుకోవలసిన చర్యలపై చర్చించడానికి అధికారులు, మంత్రులతో భేటీ అవుతారు.ఇప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తో మాట్లాడారు మరియు రెస్క్యూ మరియు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మరియు గ్యాస్ లీక్ బారిన పడిన ప్రాంతాలలో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వేలాది మంది ఆసుపత్రుల్లో ఆర్తనాదాలు ... బాధితులకు భరోసా ఇవ్వనున్న సీఎం జగన్
ఇక విశాఖలో పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. విషవాయువును కంట్రోల్ చెయ్యటానికి రెస్క్యూ టీమ్స్ పని చేస్తున్నాయి. అలాగే బాదిహులను తరలించటానికికూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు . విషవాయువులు వలన ఊపిరాకడ ఇప్పటికే ఐదుగురు మరణించినట్టు తెలుస్తుంది . మహిళలు, చిన్నారులు, 55 సంవత్సరాలు పైబడిన వ్యక్తులపై దీని ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒళ్లంతా మంటలు, బొబ్బలు, కళ్ళు మంటలతో , ఒక్కసారిగా నిల్చున్నవాళ్ళు నిల్చున్నట్టే పడిపోయారు. ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో వేలాది మంది ప్రజలు స్పృహ కోల్పోయారు. ఇక వారందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు .ఇక ఆస్పత్రుల్లో వారంతా తమ వారి క్షేమం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు . సీఎం జగన్ తన పర్యటన ద్వారా బాధితులకు భరోసా ఇవ్వనున్నారు.
Recommended Video
విశాఖ వెళ్తున్న సీఎం ... సహాయక చర్యల పర్యవేక్షణ
ఇక తాజా ఘటన నేపధ్యంలో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించి అక్కడ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. జగన్ విశాఖకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి , సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు . అన్ని రకాల సహాయక చర్యలు తీసుకోవటానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు .