ఎన్ కన్వెన్షన్కు చిక్కులు తప్పవా: చెరువు రీసర్వే పూర్తి
హైదరాబాద్: తమ్మిడికుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తీసుకునేందుకు అధికారులు శనివారం కూడా తమ్మిడికుంట చెరువుపై సర్వే నిర్వహించారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ సర్వే సమగ్ర నివేదికను దసరా పండుగ తర్వాత సర్కారుకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత మూడు నెలల క్రితం అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్టుల్లోని అక్రమ నిర్మాణాలపై మహానగర పాలక సంస్థ అధికారులు కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఇందులో కొన్నింటిని కూల్చివేయగా, మరికొన్నింటిని సీజ్ కూడా చేశారు. ఇందులో భాగంగానే గురుకుల్ ట్రస్టు భూముల్లో నిర్మితమైన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన కూడా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు.
ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించటంతో అధికారుల చర్యలకు బ్రేక్ పడింది. తమ్మిడికుంట చెరువు పూర్తి స్థాయి నీటి మట్టాలను గుర్తించాలని కొద్దిరోజుల క్రితం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రెండురోజుల పాటు జిహెచ్ఎంసి, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు ఈ రీ సర్వేను నిర్వహించారు.
ఈ రీ సర్వేకు హజరుకావాలని 13 మంది యజమానులకు నోటీసులు జారీ చేయగా, మొదటి రోజు ఎవరూ హజరుకాకపోగా, రెండో రోజైన శనివారం కొందరు హజరయ్యారు. వీరి సమక్షంలో తమ్మిడికుంట చెరువు నీటి మట్టాల రీ సర్వేను నిర్వహించారు.
1955 సంతవ్సరం రెవెన్యూ రికార్డుల ప్రకారం తమ్మిడికుంట చెరువు మొత్తం 20 ఎకరాల ఏడు గుంటల స్థలంలో చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నట్లు రీ సర్వే తొలి రోజే అధికారులు గుర్తించగా, రెండురోజు కూడా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా శాస్ర్తియంగా రీ సర్వే పూర్తి చేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. చెరువు స్థలం అన్యాక్రాంతమైనట్లు అనేక ఆధారాలు సేకరించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.