జగన్ మాటతో షాక్!: సోది అంటూ..: గిడ్డి ఈశ్వరి సంచలనం, బాబుపై ఇలా
Recommended Video
హైదరాబాద్: ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
'వైసీపీలో ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం లాంటివి ఉండవు. జగనే నిర్ణయాలు తీసుకుంటారు. మామూలుగా పార్టీ మీటింగుల్లో అభిప్రాయాలు చెప్పమంటారు. చిట్టచివరికి ఏదైనా అభిప్రాయం చెప్పినా.. అంతవరకే ఉంటాయి. నిర్ణయాలు మాత్రం ఆయనే తీసుకుంటారు. అభిప్రాయాలు చెప్పమంటారు కానీ, మనం చెప్పిన అభిప్రాయాల్లో దేనినీ టేకప్ చేసినటువంటి పరిస్థితులు లేవు. వాళ్లు చెప్పమన్నారు కనుక అభిప్రాయాలు చెబుతాం' అని గిడ్డి ఈశ్వరి తెలిపారు.
జగన్ మాటే
‘అంతెందుకు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? బహిష్కరించాలా? అన్నదానిపై అభిప్రాయాలు అడిగితే... అందరికీ అసెంబ్లీకి హాజరు కావాలనే ఉంది. ఒకరిద్దరం ఇదే చెప్పాం.. ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో గతంలో అసెంబ్లీ సమావేశంలో మైక్లు ఇవ్వలేదు. దీంతో ఈసారి పార్టీ అధినేత కూడా ఉండడు. అలాంటప్పుడు హాజరైనా ఉపయోగం ఉండదు అని భావించాను. అయితే మొదటి రోజు సమావేశాలకు హాజరై ధర్నాలాంటిది చేద్దామని భావించాము. రోజా కూడా అలాగే భావించింది. అయితే పార్టీ అధినేత అసెంబ్లీకి హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారు. దానినే శిరసావహించాం' అనిఈశ్వరి చెప్పారు.
అందుకే అనుకుంటున్నారు
‘ఈ రోజు రాష్ట్రంలో నన్ను అందరూ గుర్తించి మాట్లాడుతున్నారంటే.. గతంలో నేను పడ్డటువంటి కష్టం, వైయస్సార్సీపీలో పడ్డటువంటి శ్రమ, పార్టీ (వైఎస్సార్సీపీ) తరపున ఇచ్చినటువంటి వాయిస్, ఇవన్నీ చూసి 'గిడ్డి ఈశ్వరి ఎందుకు అలా చేసింది?' అని అంటున్నారు' అని ఆమె తెలిపారు.
మాటకు కట్టుబడే మనుషులం
‘మేము మాటకి కట్టుబడి ఉండే మనుషులం. నేను టీచర్ ని, మా నాన్న అప్పలనాయుడు ఎక్స్ ఎమ్మెల్యే. మేము ఎవరికైనా సహాయం చేసే మనుషులం. ముఖ్యంగా కష్టజీవులం. అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అనంటే... వైఎస్ జగన్ మాటతప్పడం వల్ల. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నన్ను దూషించడం వల్ల. ఇడుపులపాయలో ఆయన నన్ను దూషించారు. దానికి కారణాల్లోకి వెళ్తే.. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోవడంతో అరకు బాధ్యతలు కూడా నాకు అప్పగించారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంటు నియోజకవర్గం ఇంఛార్జీగా నన్ను నియమించారు' అని ఈశ్వరి తెలిపారు.
అన్యాయం చేయొద్దన్నా.. సోది చెప్పకంటూ
‘కుంభా రవిబాబు, పసుపులేటి బాలరాజు వంటి లీడర్స్ ని పార్టీలోకి తీసుకోకండి. వాళ్లు నాన్ లోకల్ ట్రైబ్స్' అని చెప్పాను. దీంతో 'దానితో నీకేం సంబంధం. నీకు సంబంధం లేని విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు?' అని జగన్ అడిగారు. అంతే కాకుండా 'కుంభా రవిబాబు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి ... ఇతర విషయాలు నీకెందుకు?' అని జగన్ అన్నారు. దీంతో అన్నా ఇది మీకు భావ్యం కాదు అని బతిమాలితే.. 'ఇలాంటి సోది మాట్లాడవద్దు..ఇలాంటి పంచాయతీ నాకు వద్దు' అని వెళ్లిపోయారు. దీంతో నేను షాక్ తిన్నాను’ అని ఈశ్వరి తెలిపారు.
జగన్ మాటతో ఆశ్చర్యపోయా
‘నెల రోజుల క్రితం బ్యాంకు ఉద్యోగి శెట్టి ఫాల్గుణకు నువ్వే ఎమ్మెల్యేవి అని చెప్పిన జగన్ మాటమార్చడంతో ఆశ్చర్యపోయాను. ఆ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ అయిన నాకు సంబంధం లేదంటే ఎలా? అని మధనపడ్డాను. మరెవరైనా అయితే జగన్ పాదయాత్రలో ఉన్నాడు అని పట్టించుకోకుండా ఆ రోజే, అదే టెంట్ బయటే ప్రెస్ మీట్ పెట్టి అక్కడే పార్టీ మారుతున్నట్టు ప్రకటించి ఉండేవారు. నేను మాత్రం తీవ్రంగా మధనపడిపోయాను. సర్వేశ్వరరావు పార్టీ వీడిన తరువాత క్యాడర్ చెదిరిపోకుండా కష్టపడింది నేను. ఇంత కష్టానికి లభించిన గుర్తింపు ఇదా? అని అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తరువాత పార్టీ మారాను' అంటూ తాను పార్టీ మారడం వెనుక వున్న ఆవేదనను ఆమె వివరించారు.
పార్టీ స్క్రిప్టు ప్రకారమే..
ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఫాల్గుణనే మీపై విమర్శలు చేస్తున్నారు కాదా? అని ప్రశ్నించగా.. ‘అవే విమర్శలు శెట్టి ఫాల్గుణని నా ఎదురుగా చెయ్యమనండి. అలా చెయ్యడు, ఎందుకంటే అలా చేస్తే అక్కడ ఆయనకి మనుగడ ఉండదు. అక్కడ ఆయన పార్టీ సింగిల్ కోఆర్డినేటర్. అలాంటప్పుడు పార్టీని ఫాలో కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్టు ప్రకారం మాట్లాడాల్సి ఉంటుంది. నేను కూడా కొన్ని సార్లు స్క్రిప్టు ప్రకారమే మాట్లాడాను'అని ఈశ్వరి చెప్పారు.
చంద్రబాబుపై చేసిన విమర్శలపై..
చంద్రబాబుపై చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ‘నిజానికి నేను చంద్రబాబునాయుడును దగ్గరగా కూడా ఏ రోజూ చూడలేదు. రోజాగారంటే టీడీపీలో పని చేశారు కనుక ఆమెకు అనుభవాలు ఉంటాయి కానీ, చంద్రబాబునాయుడు గారిని నేనంత దగ్గరగా చూడలేదు. వైయస్సార్సీపీలో ఉన్న ఇంకో రూల్ ఏంటంటే.. టీడీపీ వైపు చూడకూడదు. ఏ పని ఉన్నా అక్కడి నేతలు లేదా మంత్రులతో మాట్లాడకూడదు. ఆ పార్టీకి మద్దతిచ్చే ఏ అధికారుల దగ్గరకు వెళ్లకూడదన్న రూల్స్ కూడా ఉన్నాయి. అందుకని మాకేమీ తెలియదు. నిజానికి సచివాలయం కూడా ఎలా ఉంటుందో తెలియదు. రెండు రోజుల నుంచి సచివాలయానికి వెళ్తుండడంతో అదెలా ఉందో తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున అటువెళ్తే...మనం ఏదో తప్పుచేసిన వాళ్లులాగా ఉండాలి. పార్టీలో ఇతరులు కూడా అలాగే చూస్తారు. 'ఏంటమ్మాయ్! ఆ మంత్రి దగ్గరకి వెళ్తున్నావేంటి?' అని అడిగేవారు' అని గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఉప్పులేటి కల్పన, వంతల రాజేశ్వరి వైసీపీని వెళ్లినప్పుడు అర్థం కాలేదని, ఇప్పుడే అర్థమైందని చెప్పారు.