యువతిపై యాసిడ్ దాడి, లెక్చరర్ మోసం చేశాడని..
అదిలాబాద్/ఏలూరు: అదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతి పైన యాసిడ్ పోశాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో శుక్రవారగం జరిగింది. నిందితుడు కొద్ది రోజులుగా యువతి వెంట పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో అతను ఆమె పైన యాసిడ్తో దాడి చేశాడు. స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువతి ఆత్మహత్యాయత్నం
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో లెక్చరర్ మోసం చేయడంతో విద్యార్థిని కళాశాల భవనం పై నుండి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని సెకండ్ ఇయర్ చదువుతోంది. లెక్చరర్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో మనస్తాపంతో ఆమె భవనం పై నుండి దూకింది. కాగా, విద్యార్థిని పెళ్లి గురించి అడిగితే, రూ.5 లక్షలు ఇస్తేనే తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారని లెక్చరర్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-2లో అగ్ని ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్-2లో ట్యూమర్లు పగిలిపోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. షెల్ నుంచి ద్రవ ఉక్కు బయటికి వచ్చింది. హుధుద్ తుఫాను అనంతరం నిన్ననే ఉత్పత్తి ప్రారంభమైంది.
ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ అనర్హత వేటుపై హైకోర్టు స్టే
ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు అనర్హత వేటుపై హైకోర్టు స్టే విధించింది. ఆయనపై ఆ జిల్లా కలెక్టర్ జారీ చేసిన అనర్హత తీర్పును కోర్టు నిలుపుదల చేసింది.
జన్మభూమిలో గొడవ
కృష్ణా జిల్లా పిట్టల్లంక జన్మభూమి కార్యక్రమంలో వైయస్సార్, తెలుగుదేశం పార్టీల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య గొడవ కారణంగా తీవ్ర ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. కాగా, తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ పైన వైయస్సార్ కాంగ్రెస్ దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది.