ప్రేమించకుంటే చంపేస్తానని అమ్మాయికి బెదిరింపు
విజయవాడ: అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించుకుంటే చంపేస్తానంటూ ఓ యువకుడు అమ్మాయిని పదే పదే బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. శుక్రవారంనాడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
గాయపడిన అమ్మాయిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాలకు వెళ్తున్న సమయాల్లో యువకుడు తన వెంటపడుతూ వేధింపులకు పాల్పడేవాడని అమ్మాయి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. లావణ్య అనే 20 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కల్తీ పాల ముఠా గుట్టు రట్టు
గుంటూరు జిల్లాలో కల్లీపాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. రైతుల నుంచి సేకరించిన పాలలో యూరియా, నూనె కలుపుతున్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.