'కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి' వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కనీసం కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, కనీసం కొత్త అసెంబ్లీలోనైనా సభను సజావుగా నడిపించి, తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాలో మట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు మూడేళ్ల పాలనలో విపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.

ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ నేతలు ప్రస్తావించిన ఏ అంశంపైనా సభలో అధికార పక్షం వివరణ ఇవ్వలేదన్నారు. కేవలం మేం చెప్పిందే మీరు వినండి అనేలా అధికార పక్షం ప్రవర్తిస్తోందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో మార్చి 6వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 13న ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కనీసం కొత్త అసెంబ్లీలోనైనా సంప్రదాయం పాటించాలని, సభను సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పక్షం చేసే తప్పులను ఎత్తిచూపడమే విపక్షంగా తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో.. తాగునీటి సమస్యలు, నిరుద్యోగ భృతి, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు లాంటి ఎన్నో సమస్యలు ఉన్నట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అక్రమాలు, పార్టీ ఫిరాయింపుల అంశం, స్విస్ ఛాలెంజ్ విధానం, రాజధాని కోసం చేపట్టిన భూ సేకరణ, సమీకరణపై ప్రశ్నించాల్సి ఉందన్నారు.
అయితే హదరాబాద్ లో జరిగిన సమావేశాలలో కనీసం ఒక్కరోజు.. ఒక్క సెషన్ కూడా సభ సజావుగా సాగనివ్వలేదని, ప్రతిపక్షాలకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెలకు పల్లెలు వలస వెళ్లిపోతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ అధికారులపై టీడీపీ ప్రభుత్వం నిందలు మోపుతోందని విమర్శించారు. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications