ప్రమాద స్థాయి: ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి
రాజమండ్రి: గోదావరి నదిలో పెరుగుతున్న నీటిమట్టంతో ధవళేశ్వరం వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ధవలేశ్వరం బ్యారేజి వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగింది. సోమవారం ఉదయం నుంచి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది.
ప్రస్తుతం గోదావరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ధవలేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నీటి మట్టం 11.75 అడుగులకు పెరగడంతో ఒకటవ ప్రమాద హెచ్చరికను నీటి పారుదల శాఖ అధికారులు జారీ చేశారు.

వరద వల్ల ఏజన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలంలోని సుమారు 30 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే సీతానగరం మండలంలోని మొలకలలంక, రాజమండ్రి అర్బన్ మండలంలోని పాత బ్రిడ్జీలంక కూడా పూర్తిగా గోదావరి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడవల రాకపోకలు, బోటు షికారును కూడా అధికారులు నిషేధించారు.
వరద ఉధృతి సోమవారం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద వల్ల ఎలాంటి ప్రమాదం కలగకుండా జిల్లా కలెక్టర్ అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లాలో గోదావరి ఉధృతి అధికంగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 52.4 అడుగులకు చేరుకుంది. కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సబ్కలెక్టర్ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరోవైపు కల్యాణకట్ట, కొత్తకాలనీలోకి వరద నీరు వచ్చి చేసింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications