గోదావరి వరదలు: ధవళేశ్వరం వద్ద పొంచిఉన్న పెను విపత్తు; 628 గ్రామాలలో భయం భయం!!
గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.రికార్డుస్థాయిలో గోదావరికి చేరిన వరద ప్రభావంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. గోదావరిలో నీటిమట్టం 70 అడుగులను దాటి మరింత పెరుగుతుండటం రెండు తెలుగు రాష్ట్రాలలోను ఆందోళన కలిగిస్తుంది. గోదావరి వరదల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి.

ఎగువన నీరు వదలటంతో దిగువన ధవళేశ్వరం వద్ద గోదావరి డేంజర్ బెల్స్
గోదావరి ఉధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో ఎగువ నుండి వచ్చిన గోదావరి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. తెలంగాణలో గోదావరి వరద నీటిని దిగువకు వదులుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద అనేక కోనసీమ గ్రామాలను ముంపుకు గురి చేసింది. వరద ఉధృతి నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసి ఎగువ నుండి వస్తున్న వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. శుక్రవారం ఉదయం ధవళేశ్వరం వద్ద 17. 75 అడుగుల నీటిమట్టం, రాత్రి 12 గంటలకు 19.50 అడుగులకు చేరింది.

25 లక్షల క్యూసెక్కుల వస్తే మరిన్ని గ్రామాలకు ప్రమాదం
22,04,884 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇక శనివారానికి గోదావరి ధవళేశ్వరం వద్ద వచ్చే వరద ప్రవాహం 25 లక్షల క్యూసెక్కుల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు. గోదావరికి వస్తున్న వరద నేపథ్యంలో ఇప్పటికే ముంపుకు గురైన గ్రామాలతో పాటు మరిన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదముందని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే 279 గ్రామాలు వరద ముంపులో.. 628 గ్రామాలపై ప్రభావం పడే ఛాన్స్
మొత్తం గోదావరి వరదల ప్రభావంతో 6 జిల్లాలలోని 42 మండలాల పరిధిలో 279 గ్రామాలు వరద ప్రభావం చూపుతున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరో 177 గ్రామాలలో కూడా వరద నీరు చేరిందని, ఒక వేళ శనివారం గోదావరి ఉధృతి మరింత పెరిగితే, 25 లక్షల క్యూసెక్కులకు చేరితే దాని ప్రభావం 628 గ్రామాలపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 21 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, కాకినాడ జిల్లాలో రెండు మండలాలు వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

220 పునరావాస కేంద్రాల్లో 63వేల మంది.. మౌలిక వసతులు లేక ఇక్కట్లు
బాధితుల కోసం 229 వైద్య శిబిరాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వారి కోసం 220 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 63 వేల మందిని తరలించినట్టు గా తెలుస్తోంది. ఇక పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలు మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో 59 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ఎనిమిది మండలాలలోని 13 గ్రామాలలో వరద ప్రభావం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 37, కోనసీమలో 73 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 20 వేల మందికి వసతులు కల్పించారు.













Click it and Unblock the Notifications