Prawn: గోదారి రొయ్య విలవిల..! అమ్మడుపోక-చెరువులో ఉండలేక..!
ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల (Prawn) సాగు అనగానే ముందుగా గుర్తుకొచ్చే ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా. రాష్ట్రంలో అక్వారంగం ఎగుమతుల్లో 51 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. దాదాపు 3 లక్షల ఎకరాల్లో అక్వా సాగు జరుగుతుంటుంది. ఇందులో సగం వాటా రొయ్యల సాగుదే. ఏటా 4 లక్షల టన్నుల వరకూ రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోతోంది. ఓవైపు వేసవి వేడి, మరోవైపు కౌంట్ ధరలు తగ్గిపోవడంతో చెరువులో నుంచి రొయ్య బయటికి తీయలేని పరిస్ధితులు దాపురిస్తున్నాయి. అలాగని చెరువులో ఉంచితే పీహెచ్, వ్యాధుల బెడద పొంచి ఉంటోంది.
రొయ్యల రైతు విలవిల (Prawn Farmers)
రాష్ట్రంలో అక్వారంగం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇందులో రొయ్యల సాగు మరింత కష్టంగా మారిపోతోంది. వేసవి పరిస్ధితులు ఓవైపు, సిండికేట్ ముఠాలు మరోవైపు దీనికి కారణమవుతున్నాయి. రొయ్య సాగు చేయాలంటే భారీగా పెట్టుబడి పెట్టక తప్పని పరిస్ధితులు ఓవైపు, అంత పెట్టుబడులు పెట్టినా చివరకు లాభాలు వస్తాయా అంటే అదీ అనుమానమే అన్న పరిస్ధితులు రైతుల్ని కుంగదీస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్ధితులు, వ్యాధులతో పాటు వ్యాపారులు సిండికేట్ గా మారి ధరల్ని తగ్గించేస్తుండటంతో ఎకరానికి లక్ష వరకూ నష్టం వస్తోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

రైతు బలహీనతే వ్యాపారి పెట్టుబడి
ప్రతీ ఏటా ఈ సీజన్ లో రైతులు చెరువుల్లో నుంచి రొయ్యల్ని పట్టి అమ్ముకుంటుంటారు. అలా పట్టకపోతే ఆక్సిజన్ అందక, ఇతర కారణాలు కూడా తోడై అవి చనిపోతుంటాయి. సరిగ్గా ఈ కారణాలనే వ్యాపారులకు వరంగా మారుతున్నాయి. భారీగా ధరలు తగ్గించేసి వారు రైతుల పొట్టకొడుతున్నారు. ఫిబ్రవరిలో 100 కౌంట్ రొయ్యలు రూ270 ఉంటే, ఇప్పుడు అవి కాస్తా రూ.220కి తగ్గిపోయాయి. ఈ నెల మొదటి వారంలో 60 కౌంట్ రూ.310 ఉంటే మే 18కి రూ.295కి, 21కి రూ.280కి తగ్గిపోయింది. అలాగే ఒకటి, రెండు టన్నులుంటే కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతు కష్టాలు రెట్టింపవుతున్నాయి.

పట్టించుకోని ప్రభుత్వం
ఓవైపు రొయ్యల రైతులు ధరలు లేక అల్లాడుతున్నా, సిండికేట్ గా మారి వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నా ప్రభుత్వం మాత్రం వీరిని పట్టించుకునే పరిస్ధితి కనిపించడం లేదు. ఈ సీజన్ లో ఇదంతా మామూలే అన్నట్లుగా ఈ సమస్యను చూస్తోంది. దీంతో వ్యాపారులు మరింత చెలరేగిపోతున్నారు. రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే .. ఇప్పుడు వారిని గాలికొదిలేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. సీజన్ మారితేనే కానీ వీరి కష్టాలు తీరేలా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications