గోకుల్చాట్ బ్లాస్ట్: సానియా కేసులో ట్విస్ట్, డీఎన్ఏ పరీక్ష
హైదరాబాద్: ఓ వ్యక్తి కూతురు కోసం న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. తన కూతురిగా భావిస్తున్న బాలిక విషయంలో చిక్కులు ఎదుర్కొంటున్నాడు. ఆ చిక్కుముడిని విప్పేందుకు పోలీసులు డీన్ఏ పరీక్షకు అనుమతించాల్సిదిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సంఘటన గోషామహల్ సబ్ డివిజన్లోని షాయినాయత్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెల్తే.. 2007 ఆగస్టు 25 కోఠిలోని గోకుల్ చాట్లో ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఆ ఘటన జరిగినప్పుడు కొంతదూరంలో ఒక ప్రహరీ వద్ద నాలుగేళ్ల పాపను పెయింటింగ్ పని చేసుకుంటున్న ఓ కూలీ తీసుకెళ్లి పెంచుకుంటున్నాడు.
ఇప్పుడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత ఆ పాపకు అసలు తండ్రిని నేనంటూ ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. పాపను పెంచుకోవడం దగ్గర నుంచి వివాదాస్పదంగా ఉన్న ఈ అంశంలో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఒంటరిగా ప్రహరీ వద్ద నిలబడి ఉన్న పాప పేరు సానియా సుల్తానా అలియాస్ ఫాతిమా. పాపను పెంచుకుంటున్న పెయింటర్ పాపాలాల్. ఇతడికి ఒక పాప, బాబు ఉన్నారు.
అనాథగా ఒక పక్కన నిలబడిన సానియాను సంరక్షణలోకి తీసుకున్న తర్వాత మత వివాదం పుట్టుకొచ్చింది. ముస్లిం వర్గానికి చెందిన సానియాను హిందూ వర్గానికి చెందిన పాపాలాల్ ఎలా పెంచుకుంటారన్న వాదనలూ వినిపించాయి. తర్వాత తర్వాత ఈ వాదనలు ఒక పక్కకు పోయాయి. సానియా.. పాపాలాల్ను తండ్రిగా, ఆయన భార్య జయశ్రీని తల్లిగా భావిస్తోంది.
ప్రస్తుతం సానియా బేగంబజార్లో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ప్రస్తుతం బాలిక వయస్సు 12 ఏళ్లు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్లోని జంట పేలుళ్ల తర్వాత కొన్ని ప్రసార మాధ్యమాల్లో సానియా కథ ప్రసారమైంది. వీటిని చూసిన తర్వాత పాపకు అసలు తండ్రిని తానేనంటూ అత్తాపూర్ ఫాస్ట్ల్యాన్సర్కు చెందిన యూసుఫ్ ఇప్పుడు బయటకొచ్చాడు. యూసఫ్ వృత్తిరీత్యా డ్రైవర్. ఇతని భార్య ఈ పాతిమాను తీసుకు వెళ్తుండగా తప్పిపోయింది.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల సమయంలో పాతిమా కథనం రావడంతో.. యూసుఫ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పాపాలాల్ వద్ద ఉన్న ఫాతిమా తన కుమార్తేనని యూసుఫ్ వాదిస్తున్నాడు. డీఎన్ఏ పరీక్షల ద్వారానే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావించిన పోలీసులు వారి రక్తనమూనాలను సేకరించాల్సి ఉందని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 16వ మెట్రోపాలిటన్ మేజిసే్ట్రట్ కోర్టులో రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు
మరోవైపు, ఫాతిమాను ఎనిమిదేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్నామని, ఎవరో యూసుఫ్ అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా ఇచ్చేస్తామని పాపాలాల్ అంటున్నాడు. తన తల్లిదండ్రులు పాపాలాల్, జయశ్రీలేనని పాతిమా కూడా చెబుతోంది. తాను పాపాలాల్ను వదిలి వెళ్లనని చెబుతోంది.