సమావేశాలకు ముందే జివోఎం నివేదిక: షిండే, వేగంగా...
న్యూఢిల్లీ: జనవరి నెలలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలకు ఫోన్ చేసిన మరుసటి రోజే కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మరో విషయం చెప్పారు. శీతాకాల సమావేశాలలోపే మంత్రుల బృందం(జివోఎం) తెలంగాణపై నివేదిక ఇస్తుందని షిండే శుక్రవారం చెప్పారు.
తద్వారా తెలంగాణ వైపు కేంద్రం, కాంగ్రెసు పార్టీ అధిష్టానం వడివడిగా అడుగులు వేస్తున్నట్లుగా అర్థమవుతోంది. జీవోఎం నవంబర్ 7వ తేదిన మరోసారి భేటీ కానుంది. మరో ఒకటి లేదా రెండు సమావేశాలతో దీనికి పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.
సాయంత్రం హోంశాఖ భేటీ
రాష్ట్ర విభజనపై ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్రం హోంశాఖ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఇతర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాల పైన చర్చించనున్నారు.
రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు: విహెచ్
2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా అన్నారు. జివోఎం త్వరగా తన నివేదికను ఇస్తుందని ఆక్షేపించారు. సీమాంధ్ర బలం ఎక్కువగా ఉన్నందున అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఏమవుతుందో అందరికీ తెలిసిందేనన్నారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ను కలిసినట్లు చెప్పారు. ఏ పార్టీకి ఓటు వేయాలో అశోక్ బాబు చెప్పడం సరికాదన్నారు.