ఏపీకి కేంద్రం తీపి కబురు, విశాఖలో మెరైన్ కేబుల్ నెట్, భారత్ నెట్-2కూ ఆమోదం
ఏపీలో మెరైన్ కేబుల్ నెట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. ఐటీ పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Video
అమరావతి: రాష్ట్ర ప్రజలకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఏపీలో మెరైన్ కేబుల్ నెట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. ఐటీ పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం భూమిలో ఫైబర్ కేబుళ్లను వేసి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు. దీని ద్వారా పరిమిత వేగంతో మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందించే వీలుంది. సముద్రంలో వేసే కేబుళ్ల ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావచ్చు. దీన్నే మెరైన్ కేబుల్ నెట్ అంటారు.
రాష్ట్రమంతా సూపర్ నెట్...
విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మెరైన్ కేబుల్ నెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటికీ అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. అదే సమయంలో విశాఖపట్నం, అమరావతిలో ఏర్పాటయ్యే ఐటీ సంస్థలకు మెరైన్ కేబుల్ నెట్ ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ప్రస్తుతం దక్షిణాదిన మెరైన్ కేబుల్ నెట్ చెన్నై నగరానికే పరిమితమైంది.
విశాఖను ఐటీ హబ్ గా మార్చాలంటే...
ముంబై, కోల్కతాలోనూ మెరైన్ కేబుల్ నెట్ ఉంది. విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే విశాఖకూ మెరైన్ కేబుల్ నెట్ అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ అహ్మద్ బాబు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అయితే మెరైన్ కేబుల్ నెట్కు రూ.20వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని, కేంద్రం ఈ పథకానికి ఆమోదం తెలిపితే టెలికం కంపెనీలు కన్షార్షియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని అహ్మద్ బాబు.. సీఎంకి వివరించారు.
చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే...
దీంతో ఆదివారం సాయంత్రం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సహానితో సీఎం మాట్లాడారు. మెరైన్ కేబుల్ నెట్ ప్రతిపాదనను ఆయన ముందుంచారు. సీఎం ప్రతిపాదనకు అజయ్ సహానీ సూత్రప్రాయంగా అంగీకరించారు. తక్షణమే ప్రతిపాదనలు పంపితే పరిశీలించి, ఆమోదిస్తామని సీఎంకి హామీ ఇచ్చారు. దీంతో మెరైన్ కేబుల్ నెట్కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబు ఐటీ శాఖను ఆదేశించారు.
భారత్ నెట్-2కు కేంద్రం సమ్మతి...
మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఇంటర్నెట్ వ్యవస్థను విస్తరించే భారత్ నెట్ -2కు కేంద్ర ఐటీ శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఫైబర్ నెట్ పనులను సమీక్షించిన ఐటీ శాఖ వాటిపై సంతృప్తి వ్యక్తం చేసి, భారత్ నెట్ -2 మంజూరుకు ఓకే చెప్పింది. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి రూ.1100 కోట్లు వస్తాయని ఏపీఎస్ఎఫ్ఎల్ ఉన్నతాధికారులు తెలిపారు.
5 లక్షల ట్రిపుల్ ప్లే బాక్సులకు ఆర్డర్...
రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను పెంచేందుకు వీలుగా 5 లక్షల ట్రిపుల్ ప్లే బాక్సులను ఫైబర్ నెట్ అధికారులు ఆర్డర్ చేశారు. ఫైబర్ నెట్ సేవల కోసం ఇప్పటి వరకు రెండు బాక్సులను వినియోగిస్తున్నారు. దీని కోసం రూ.4వేలు చెల్లించాల్సి వస్తోంది. ట్రిపుల్ ప్లేబాక్సు అందుబాటులోకి వస్తే ఒక్క బాక్సు ద్వారానే ఫైబర్ నెట్ సేవలు అందించవచ్చు. దీనికి కేవలం రూ.3500 మాత్రమే ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.