2024లో ఏం జరగబోతోంది ? ముందే తేల్చేసిన అమరావతి-మిగతా రాష్ట్రంపై ఉత్కంఠ !
ఏపీలో మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండదండలూ అందిస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. అయినా వైసీపీ మాత్రం బేషరతుగా మద్దతిస్తూనే ఉంది. మరోవైపు రాష్ట్రంలో మారుతున్న పరిస్ధితుల్లో జనం కూడా వైసీపీ-బీజేపీ పరోక్ష పొత్తుపై ఓ క్లారిటీకి వచ్చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తీర్పుకు ఇప్పుడే రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో ముందే తీర్పు వచ్చేస్తోంది.

బీజేపీకి అమరావతిలో చుక్కలు
అమరావతిలో ఏపీ బీజేపీ నేతలు పాదయాత్ర రూపంలో పర్యటిస్తున్నారు. ఇందులో అమరావతి రాజధానికి మద్దతుగా వారు రోజూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తమకు అవకాశం ఇస్తే ఏడాదిలో రాజధాని కట్టి చూపిస్తామంటున్నారు. గతంలో అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని, మీరు అధికారమిస్తే తాము ఈసారి రాజధాని పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నారు. అయినా రైతుల నుంచి మాత్రం షాకులు తప్పడం లేదు. అసలు అమరావతిలో రాజధానికి శంఖుస్ధాపన చేసింది ప్రధాని మోడీయేనని చెప్పుకుంటున్నా జనం మాత్రం నమ్మడం లేదు. దీంతో అమరావతిలో జనాన్ని ఎలా నమ్మించాలో తెలియక సోము వీర్రాజు సహా బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు.

జగన్-బీజేపీ కుమ్మక్కు
అమరావతిలో బీజేపీ నేతలు చేస్తున్న టూర్ లో వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వైసీపీతో బీజేపీ కుమ్మక్కైందన్న ఆరోపణలే. స్ధానికంగా అమరావతి గ్రామాల్లో ఇన్నాళ్లుగా రాజధాని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రైతులు.. ఇందుకు వైసీపీ-బీజేపీ కుమ్మక్కే కారణమన్న భావనలో ఉన్నారు. గతంలో వైసీపీ మూడు రాజధానుల వాదన తెచ్చినా బీజేపీ మాత్రం తమకు సహకరిస్తుందని ధీమాగా ఉన్న రైతులు.. తాజాగా కొంతకాలంగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అక్కడికి వెళ్తున్న బీజేపీ నేతలకు రైతుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు నచ్చజెప్పలేక ఇరుకునపడుతున్నారు.

టీడీపీ ఏకైక ఛాంపియన్ అవుతుందా ?
ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాము ఈ ప్రాంతంలో సునాయాసంగా గెలవడం ఖాయమని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. అసలు అమరావతి రాజధాని తెచ్చిందే తాము కాబట్టి.. ఇప్పుడు దాన్ని కాపాడుతోంది కూడా తామేనని ఇప్పటికీ టీడీపీ చెబుతోంది. అలాగే గతంలో రాజధాని గ్రామాల్లో జనం భూసమీకరణకు వ్యతిరేకంగా వర్గాలుగా విడిపోయారు. కానీ ఇప్పుడు అంతా ఏకమొత్తంగా నష్టపోయారు. దీంతో ఇక్కడి జనం గంపగుత్తగా టీడీపీకి అండగా నిలుస్తున్నారు. దీని ప్రభావంతోనే బీజేపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్-బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ ఇక్కడి స్దానికులు చేస్తున్న ఆరోపణలకు కాషాయ నేతల వద్ద సమాధానం దొరకడం లేదు.

జగన్ కు డిసైడర్ అదేనా ?
అమరావతి ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందన్నది తాజా పరిణామాలు తేల్చేస్తున్నాయి. దీంతో టీడీపీ హ్యాపీగానే కనిపిస్తోంది. అయితే మిగతా రాష్ట్రం ఎన్నికల నాటికి ఎలా స్పందిస్తున్నది జగన్, చంద్రబాబుల భవిష్యత్తును తేల్చాల్సి ఉంది. దీంతో అమరావతిలో జనం తరహాలోనే వైసీపీ-బీజేపీ కుమ్మక్కుపై ఆగ్రహంగా ఉన్నారా లేదా అన్న దానిపై ఇప్పుడు జగన్ దృష్టిసారిస్తున్నారు. బీజేపీతో తాము నేరుగా కలిస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవని భావించి కేంద్రంలో కూడా చేరకుండా దూరం పాటిస్తున్న జగన్ కు.. ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు స్పందించే తీరు కీలకంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications