కేంద్రం అన్నీ ఇస్తోంది: ఇంకేమిటని సుజన ఆసక్తికర 'మంచి' వ్యాఖ్య, అలా కాదని ట్విస్ట్
న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం ఇప్పుడు ప్యాకేజీ ఇచ్చినా, హోదా ఇవ్వదని కాదని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పాజిటివ్గా ఉండాలని, ఏపీకి మంచి జరగబోతుందనే సిగ్నల్స్ వస్తున్నాయని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి గురువారం అన్నారు.
ఆయన టిడిపి ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని, అలా పెట్టకుండా తప్పు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ వల్లే ఈ దుస్థితి అన్నారు.
కేంద్రం సాయం విషయంలో తాము ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నామన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు కూడా ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
హోదా లేదు, భారీ ప్యాకేజీ, అమరావతికి 5వేలకోట్లు: నో చెప్పిన బాబు, పవన్కు నో రెస్ట్!
చంద్రబాబు రాజీపడట్లేదు
రెండు రోజులుగా చంద్రబాబుతో మాట్లాడినప్పుడు ఆయన కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పారన్నారు. దీనిపై కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా రాజీపడకుండా హోదా కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు.
ఏపీని ప్రత్యేక పరిస్థితుల్లో విభజించారని, కాబట్టి ఏపీ ఇతర రాష్ట్రాల్లా సమాన స్థాయికి వచ్చే వరకు ఆదుకోవాలన్నారు. హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నామన్నారు. ఏపీకి హోదాను ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కూడా తాము చెబుతున్నామన్నారు.
ప్యాకేజీ అంటే హోదా ఇవ్వరని కాదు
సమైక్యంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అడగలేదని, విభజన జరిగాక నవ్యాంధ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున అడుగుతున్నామన్నారు. తాము రెండేళ్లుగా హోదా కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. హోదా ఏపీ ప్రజల హక్కు అన్నారు. ఏపీకి సంబంధించిన చాలా అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఏపీకి ప్యాకేజీ తయారు చేస్తున్నారు, ఇస్తున్నారంటే హోదా ఇవ్వరని కాదన్నారు.
హోదా విషయమై లాభ నష్టాల పైన కేంద్రం బేరీజు వేస్తోందన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇస్తుందన్నారు. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్రం చెప్పిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. విభజన నష్టాల నుంచి గట్టెక్కేందుకే హోదా అడుగుతున్నామన్నారు.
పాజిటివ్గా ఉండండి... ఇవి ఇస్తున్నారు
రాష్ట్ర ప్రయోజనాల పైన పాజిటివ్గా ఉంటే మంచిదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తుందన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇస్తున్నారని చెప్పారు.
ఎవరికీ తొందరపాటు పనికి రాదని చెప్పారు. ప్రత్యేక హోదాను ఎలా సాధించాలో చూసుకోవాలన్నారు. ఏపీకి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ ఇస్తారని భావిస్తున్నామన్నారు.
పోలవరంకు తొలుత 70:30 ప్రకారం నిధులు ఇస్తామన్నారని, ఒత్తిడి చేయడంతో 90:10 ఇచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. పునరావాస ప్యాకేజీ వల్ల పోలవరం ఖర్చు పెరిగిందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ ఇచ్చే అవకాశముందన్నారు. జాతీయ సాగునీటి ప్రాజెక్టులకు సాగునీటి ద్వారా నిధులు వస్తాయన్నారు. విశాఖ రైల్వే జోన్ చర్చల్లో ఉందన్నారు.
ఏపీకి మంచి జరగబోతుందనే సిగ్నల్స్
కేంద్రం ఏపీకి ప్యాకేజీ ఇచ్చినా హోదా ఇవ్వచ్చునని చెప్పారు. మొత్తానికి ఏపీకి మంచి జరగబోతుందనే సిగ్నల్స్ కేంద్రం నుంచి వస్తున్నాయన్నారు. ఏపీకి ఏం చేస్తారనే విషయం రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తాము రాజీపడటం లేదని చెప్పారు.
సాయం ఏ రూపంలో చేసినా అంగీకారమే.. హోదాకు సమానంగా
ఏపీకి కేంద్రం సాయాన్ని ఏ రూపంలో చేసినా అంగీకారమేనని చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం లెక్కలు వేస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని మాకు ఎవరూ చెప్పలేదన్నారు.