మరో అడుగు ముందుకు: 'అమరావతి' నిర్మాణంలో వాస్తు ప్రభావం?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణం దిశగా మరో స్పష్టమైన అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మరో బృహత్తర ప్రణాళిక ఆవిష్కృతమైంది.
కృష్ణానది తీరాన ఆవిర్భవించనున్న 21వ శతాబ్దపు నగరంలో ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణంలో వాస్తు శాస్త్రం కీలక పాత్ర పోషించనుంది.
ఇంద్రుని రాజధానిగా అమరావతికి ఉన్న లక్షణాలను పుణికుపుచ్చుకోనుంది. వాస్తు శాస్త్ర ప్రకారం రాజధాని అమరావతిని నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నగరానికి అనుగుణమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడంలో, ప్రధాన మార్గాల అభివృద్ధిలో వాస్తును అనుసరించారని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.

వాస్తు శాస్త్ర ప్రకారం అమరావతి నగరంలోకి 'పాజిటివ్ ఎనర్జీ' వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారట. రాజధానిలో నిర్మాణాలను చేపట్టే ముందు సదరు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, దాని భౌగోళిక స్థితిగతులు, సమీపంలోని కొండలు, జలవనరులను పరిగణనలోకి తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచించారు.
నిపుణులు ఆదేశాల మేరకు క్యాపిటల్ రీజియన్లో కృష్ణా నదికి చేరువలో పవిత్ర నగరాలైన విజయవాడ, అమరావతి క్షేత్రానికి దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని అమరావతి కోసం ఎంపిక చేశారు. అంతేకాదు ఈశాన్య దిశ నుంచి వీచే పవనాలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
దీనికి అనుగుణంగా అమరావతి నిర్మాణాలను అదే దిశలోనే ప్రధాన ప్రవేశ మార్గాన్ని మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు. ఏ నిర్మాణనికైనా కేంద్ర స్థానం (బ్రహ్మస్థానం) అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రతి నగరంలోనూ సరిగ్గా దాని మధ్య ప్రదేశాన్ని ఖాళీగా ఉంచితే అది ఆ నగరాభివృద్ధికి కేంద్ర స్థానంగా విలసిల్లుతుంది.
అమరావతి నగరానికి ఒకవైపు ఎత్తైన కొండలు, వాటికి అభిముఖంగా నదీ తీర ప్రాంతం అభివృద్ధిని దశదిశలా చూపేలా ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా అమరావతి 'వేద నగరి'గా విలసిల్లుతుందని సీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే రాజధాని మాస్టర్ ప్లాన్లో మంగళగిరి సమీపంలోని నిడమర్రు వద్ద పొందుపరిచిన భారీ విమానాశ్రయ ప్రతిపాదనను సీఆర్డీఏ ఉపసంహరించుకుంది.












Click it and Unblock the Notifications