గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్ధానికుల దాడి- స్ధానిక నేత హత్యలో ప్రమేయంపై
ఏపీలో ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఇవాళ సొంత నియోజకవర్గంలో దాడి జరిగింది. వైసీపీకి చెందిన జి.కొత్తపల్లి గ్రామాధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్ధులు క్రూరంగా చంపారు. ఈ హత్యలో రగిలిపోయిన గ్రామస్ధులు.. ఇందులో ఎమ్మెల్యే అనుచరుడి ప్రమేయంపై ఆగ్రహంవ్యక్తం చేస్తూ పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఇందులో ఆయనకు గాయాలయ్యాయి.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో గ్రామాధ్యక్షుడు దారుణ హత్య తర్వాత గ్రామంలో పరిస్ధితులు ఉద్రిక్తంగా మారాయి.వైఎస్ఆర్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను ఉదయం దుండగులు పాతకక్షలతో హత్యచేశారు.
దీంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించే్ందుకు ఎమ్మెల్యే జి.కొత్తపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహంగా ఉన్న గ్రామస్ధులు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై దాడికి దిగారు. సెక్యూరిటీ వారిస్తున్నా వినకుండా వందల సంఖ్యలో దూసుకొచ్చిన స్ధానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అతికష్టం మీద ఎమ్మెల్యేను సెక్యూరిటీ అక్కడి నుంచి తరలించారు.
ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో అడ్డుపడ్డ పోలీసులపైనా స్ధానికులు దాడి చేశారు. దీంతో వందల సంఖ్యలో ఉన్న గ్రామస్ధుల్ని అడ్డుకోవడం పోలీసులకు కూడా కష్టతరంగా మారింది. గ్రామాధ్యక్షుడి దారుణ హత్యతో ఆగ్రహంగా ఉన్న గ్రామస్తుల్ని అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో ఎమ్మెల్యేను తీసుకుని వారు అతికష్టం మీద బయటపడ్డారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఓ గ్రామస్తుడి చేయి కూడా విరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అదనపు బలగాలు పంపుతున్నారు.