గౌతమిని హత్య చేశారు, బుజ్జి మొదటి భార్య ఇతరులపై అనంతలక్ష్మి ఫిర్యాదు
గౌతమి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, ఆమెను సజ్జా బుజ్జి మొదటి భార్య ఇతరులు కలిసి హత్య చేశారని ఆమె తల్లి అనంతలక్ష్మిపోలీసులకు ఫిర్యాదు చేసింది.
పాలకొల్లు:గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని గౌతమి తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో గౌతమి కేసు మళ్ళీ మొదటికొచ్చింది.అయితే రోడ్డుప్రమాదంలో మరణించిందని పోలీసులు తేల్చిన తర్వాత ఆమె తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదుచేయడం కలకలం రేపుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన గౌతమి కొన్ని రోజుల్లోగా వార్తల్లో నిలిచారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది. వివాదం ఎందుకు కొనసాగుతోంది.
విశాఖ జిల్లాలో ఐఎఎస్ కోచింగ్ తీసుకొంటుంది. అయితే ఆమె సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన రెండు రోజుల్లోనే ఆమె మరణించింది.
అయితే రోడ్డు ప్రమాదంలోనే గౌతమి మరణించిందని రెండు రోజుల క్రితం ఎఎస్ పి రత్న ప్రకటించారు.అయితే రత్న ప్రకటించిన మరునాడే గౌతమి తల్లి మరోసారి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. తన కూతురును హత్య చేశారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది.
గౌతమిది హత్యే పోలీసులకు తల్లి ఫిర్యాదు
గౌతమి రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు తేల్చేశారు. ఈ మేరకు ఎ ఎస్ పి రత్న మీడియాకు రోడ్డు ప్రమాదంలోనే ఆమె మరణించారని చెప్పారు.అయితే మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు వేసిన కొన్ని ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేదని ప్రసారసాధనాల్లో కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేశారని తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు శనివారం నాడు ఆమె పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
గౌతమి తల్లి ఎందుకు ఫిర్యాదుచేసింది
గౌతమి మరణంపై పోలీసులు చెప్పిన వివరాలతో ఆమె తల్లి సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. దీంతో ఆమె తన కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని తల్లి అనంతలక్ష్మి ఆరోపిస్తున్నారు.నరసాపురంలోని రాయపేటకు చెందిన సజ్జా బుజ్జి, అతడి భార్య శిరీష అనుచరుడు బొల్లంపల్లి రమేష్, కారుడ్రైవర్ రాంబాబు పథకం ప్రకారం తన కూతురును వెంటాడి మోటార్ సైకిల్ ను ఢీ కొట్టి హత్య చేశారని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనంతలక్ష్మి ఫిర్యాదులో ఇలా
తన భర్త పక్షవాతంతో బాధపడుతున్న సమయంలో సజ్జాబుజ్జి అనే వ్యక్తి తన చిన్న కుమార్తై పావనితో పరిచయం పెంచుకొన్నాడని చెప్పింది. ఆ తర్వాత గౌతమితో సన్నిహితంగా ఉండడంతో ఆమె భార్యతో గొడవలు అయ్యాయని అనంతలక్ష్మి ఫిర్యాదులో చెప్పింది.అయితే తన భార్యతో విడాకులు తీసుకొంటున్నానని నమ్మించి బుజ్జి గౌతమిని వివాహం చేసుకొన్నాడని ఆమె చెప్పింది.ఈ విషయం తెలుసుకొన్న బుజ్జి మొదటి భార్య శిరీష అనుచరుడు రమేష్, డ్రైవర్ రాంబాబులు తమ కుమార్తెను , అవసరమైతే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించేవారని అనంతలక్ష్మీ ఫిర్యాదు చేసింది.
బుజ్జి ప్రవర్తనలో మార్పు
అయితే తన కూతురుకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్ వివరాలను బుజ్జికి వివరిస్తే అన్నీ తాను చూసుకొంటానని బుజ్జి చెప్పేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కొంది.అంతేకాదు విశాఖలో సివిల్స్ ప్రిపేరయ్యేందుకు గౌతమిని విశాఖకు బుజ్జి పంపాడని ఆమె చెప్పారు. అప్పటి నుండి బుజ్జి ప్రవర్తనలో మార్పు వచ్చిందన్నారు. ఈ నెల 11వ, తేదిన సంక్రాంతి పండుగ కోసం గౌతమి ఇంటికి వచ్చిందన్నారు. అప్పటి నుండి తన కూతుళ్ళు ఎక్కడికివెళ్తున్నారనే విషయాన్ని డ్రైవర్ రాంబాబు, బుజ్జి అనుచరుడు రమేష్ గమనించేవారని చెప్పారు. ఈ నెల 17న, గౌతమికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్ళాలని బుజ్జిని కోరితే తనకు వేరే పనుందని చెప్పడంతో పావనిని తీసుకొని గౌతమి పాలకొల్లు ఆసుపత్రికి వెళ్ళిందన్నారు.నరసాపురం తిరిగివస్తుండగా దిగమర్రు సమీపంలో కారుతో ఢీకొట్టి తన కూతురును హత్య చేశారని తల్లి అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.