పీఆర్సీ - డీఏ చెల్లింపులపై కొత్త నిర్ణయం : పదవీ విరమణ తరువాతనే - రికవరీ నిలిపివేత..!!
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ - డీఏ బకాయిల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తరువాతనే పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఐఆర్ రికవరీ నిలిపివేస్తున్నట్లు ఉద్యోగులకు ఊరట కలిగించే విషయం వెల్లడించింది. విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలకూ పీఆర్సీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పీఆర్సీ - డీఏ బకాయిలను పదవీ విరమణ తరువాత ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చకు కారణమైంది.

పదవీ విరమణ తరువాతనే బకాయిలు
బకాయిలను ఇప్పటివరకు పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఈసారి పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అదే సమయంలో జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన మధ్యంతర భృతి (ఐఆర్) రికవరీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఇక, ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు 21 నెలలకు ఇవ్వాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తరువాత ఇవ్వనున్నారు. పీఆర్సీ అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా 8 జీవోలను విడుదల చేసింది.

పెన్షనర్లకు మాత్రం ఇలా
పెన్షనర్లకు మాత్రం ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు పీఆర్సీ, డీఏ బకాయిలు రావాల్సి ఉంటే వీటిని 2023 జనవరి నుంచి నాలుగు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనున్నారు. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఐఆర్ రికవరీ ఉండదు. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనం జనవరి 2022 నుంచి ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనరు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని రూ.25వేలకు పెంచింది. ఇది జనవరి 2022 నుంచి వర్తిస్తుంది. కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బందికి 11వ పీఆర్సీ సవరించిన పే స్కేల్స్-2022ను వర్తింప చేస్తూ ఆర్థికశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది.

అయిదేళ్లకే పీఆర్సీ..తాజా నిర్ణయాలు
పే స్కేల్కు చేరుకున్న ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నారు. పీఆర్సీ సిఫార్సు ప్రకారం ఉద్యోగులకు గ్రేడ్ల వారీగా డీఏ, వసతి భత్యాలు చెల్లించనున్నారు. రాష్ట్రంలో పర్యటిస్తే డీఏ గరిష్ఠంగా రూ.600, ఇతర రాష్ట్రాలకు వెళ్తే గరిష్ఠంగా రూ.800 చెల్లించనున్నారు. అయితే, ఉద్యోగులకు పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయనున్నట్లు ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
జనవరి 17న ఇచ్చిన ఉత్తర్వు నంబరు-1లోని పేరా 15లో ఇచ్చిన సెంట్రల్ పే కమిషన్కు బదిలీ అంశాన్ని తొలగిస్తున్నట్లు తాజా ఉత్తర్వు-102లో పేర్కొంది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ ఉత్తర్వుల పైన స్పందించిన సంఘాల నేతలు..గతంలో అనుసరించిన విధానాల మేరకే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో బకాయిలు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications