మాకు న్యాయం జరగలేదు .. చంద్రబాబును టార్గెట్ చేసిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. అనవసరంగా తమకు రాజకీయాలు ఆపాదించారు అని పేర్కొన్న వెంకట్రామిరెడ్డి గత ముఖ్యమంత్రి ఉద్యోగులను ఢిల్లీకి తీసుకు వెళ్లి బిజెపిని ఓడించాలని ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేసి విమర్శలు గుప్పించారు. సర్పంచ్ గా వార్డు మెంబర్ లు గా కూడా గెలవలేని వారు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారని వెంకట్రామి రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో వైరం మంచిదికాదని వెంకట్రామిరెడ్డి హితవు పలికారు .
సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!
తమ వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం... న్యాయం జరగలేదు
ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని మాత్రమే కోరామని, ఎన్నికల విధుల్లో పాల్గొనం అని తాము చెప్పలేదని మరో మారు స్పష్టం చేసిన వెంకట్రామిరెడ్డి అనవసరంగాఉద్యోగులపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందని ఉద్యోగులకు కోర్టు నిర్ణయంతో న్యాయం జరగలేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని చెప్పిన వెంకట్రామిరెడ్డి సీఎస్ ను కలుస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల్లో కరోనాతో ఎవరైనా చనిపోతే 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్
50 ఏళ్లు దాటిన మహిళలకు పోలింగ్ డ్యూటీ వేయొద్దని కోరుతామని, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సైతం ఎన్నికల విధుల నుండి మినహాయింపు కావాలని కోరుతామని వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల విధులను చేసిన ఉద్యోగులకు ఎవరికైనా కరోనా సోకిన మృతి చెందితే 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని వెంకట్రామి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తమను వివాదాల్లోకి లాగిందన్నారు .
ఉద్యోగుల పై వ్యాఖ్యలు చేసిన తర్వాతనే ఉద్యోగ సంఘాలు స్పందించాయి
తామెప్పుడూ ఎన్నికల కమిషన్ తో విబేధించలేదని వెంకట్రామిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగుల పై వ్యాఖ్యలు చేసిన తర్వాతనే ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యలు చేశాయని చెప్పుకొచ్చిన ఆయన ఎన్నికల విధుల్లో పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. శనివారం ఎన్నికల విధులు చేయ్యబోమని తేల్చి చెప్పటమే కాకుండా అవసరం అయితే తమ ప్రాణాల మీదకు వస్తే ఎవర్నైనా చంపే హక్కు కూడా తమకు ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డి సుప్రీం తీర్పు నుండి యూ టర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు .