ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ఖర్చు ఎంతో తెలుసా?
విజయవాడ: రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారాయన. బహిరంగ ప్రదేశాలో చేయడం వల్ల ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో ఓ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. దుబారాను నియంత్రించడంలో భాగంగా- ఓ సాధారణ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారంటూ వార్తలు వచ్చాయి. అనుకున్నట్టే సాధారణ ఏర్పాట్ల మధ్య ప్రమాణ స్వీకారం ముగిసింది.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం చేసిన ఖర్చు 50 లక్షల రూపాయల లోపే. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు మొదలుకుని, ప్రముఖుల భోజనాల వరకు చేసిన ఖర్చు 48 లక్షల 50 వేల రూపాయలుగా చెబుతున్నారు.
ఇందులో 29 లక్షల 10 వేల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం అడ్వాన్స్గా విడుదల చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కుటుంబం హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు, ఆయన నివాస వసతితో పాటు ప్రముఖులకు భోజన సదుపాయాలు, ఏసీ బిల్లులను చెల్లించడానికి అడ్వాన్స్గా ఈ 29 లక్షల 10 వేల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు.