ఆఖరి ఘట్టానికి: ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ వేగవంతం

రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ కూడా విభజన ప్రక్రియను సమీక్షించి జాప్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిన ఆయన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సిఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ప్రతి శాఖ తమకు సంబంధించిన శాఖలో విభజన ప్రక్రియపై నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ ఆదేశించారు.
ఇరు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు రూపొందించేందుకు మే 10వ తేదీన గడువుగా నిర్ణయించారు. దీనిని నేరుగా గవర్నర్ చూసుకుంటారు. అలాగే ఇరు రాష్ట్రాల్లో యువతకు ఉన్నత విద్య అందించేందుకు అవసరమైన చర్యలను కూడా గవర్నరే పర్యవేక్షిస్తారు. సింగరేణి బొగ్గు గనుల్లో 51 శాతాన్ని తెలంగాణ రాష్ట్రానికి బదలాయించే అంశాన్ని మే పదిలోగా, కొత్త రాష్ట్రానికి బొగ్గు కేటాయింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం మే 15లోగా పూర్తి చేసేందుకు నిర్ణయించారు.
ఆరు నెలల వరకు ఇరు రాష్ట్రాలకు ఇప్పుడు ఉన్న ఇఆర్సిని కొనసాగిస్తూ ఆ తరువాత కొత్త రాష్ట్రానికి మరో ఇఆర్సిని ఏర్పాటు చేసేందుకు అవసరమై చర్యలను మే పదిలోకి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ బాధ్యత కూడా గవర్నర్ నేరుగా చూసుకుంటారు. ప్రస్తుతం సెంట్రల్ డిస్కామ్లో ఉన్న అనంతపురం, కర్నూలును దక్షిణ డిస్కామ్లోకి బదలాయించే చర్యలను కూడా మే 10కి పూర్తి చేయనున్నారు.
కొత్త రాష్ట్ర రాజధానికి కల్పించాల్సిన పన్ను రాయితీ, సోషియో ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర వౌళిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు వచ్చే నెల 10వ తేదీలోగా ఖరారు చేయాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి బోర్డులను కూడా మే 25లోగా ఏర్పాటుచేసేందుకు, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం రూపొందించేందుకు రాష్ట్ర స్థాయిలో మే 25లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
మరోవైపు ఉద్యోగుల విభజనను మే 25 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. మే 24కే జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆ మరుసటి రోజుకే ప్రాథమిక ఉద్యోగుల విభజన కూడా జరిగిపోయేలా చూస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మే 28న ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పంపకాలు కూడా జరగనున్నాయి. పెన్షన్లు ఎక్కడి వారికి అక్కడే ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications