గవర్నర్ చొరవ తెలివైందే, కానీ ఆలస్యం: దత్తాత్రేయ
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఒకచోటికి తేవడానికి గవర్నర్ నరసింహన్ చూపిన చొరవ తెలివైందే గానీ ఇప్పటికే జాప్యం జరిగిందని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
విభేదాలను పక్కన పెట్టి ఇరువురు ముఖ్యమంత్రులు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏక కాలంలో అభివృద్ధి చెందడానికి ఇరు రాష్ట్రాల్లో కూడా పుష్కరమైన సహజ వనరులు, మానవ వనరులు ఉన్నాయని, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన చెప్పారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి అవకాశాన్ని వినియోగించుకుని కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టుకోవాలని సూచించారు. తమ పార్టీ రెండు శాఖలు కూడా రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తాయని ఆయన చెప్పారు. వరల్డ్ క్లాస్ సిటీగా అభివృద్ధి చెందడానికి హైదరాబాదుకు పుష్కలమైన సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బెజవాడ, గుంటూరు మెడికల్ హబ్: వెంకయ్య
విజయవాడ: ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో వైద్య రంగంలో సేవలు మెరుగుపర్చాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం నగరంలో కామినేని ఆస్పత్రిని వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రజావసరాలకు తగ్గట్టు కార్పొరేట్ ఆస్పత్రులు ఏర్పడాలని ఆయన తెలిపారు.
విజయవాడ, గుంటూరు మెడికల్ హబ్గా రూపుదిద్దుకోవాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ ప్రాంతం వైద్య పర్యాటకానికి అనుకూలమన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు మానవతా ధృక్పథంతో పనిచేయాలని, పేద, మధ్యతరగతి వారికీ ధరలు అందుబాటులో ఉంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా వైద్య సేవల కోసం త్వరలో యూనివర్సల్ హెల్త్ ఇన్సురెన్స్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుందని వెంకయ్యనాయుడు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ హాజరయ్యారు.