లాక్డౌన్ గడువు ముగియబోతోన్న వేళ: అవి లేకండా రోడ్ల మీదికొస్తే.. క్రిమినల్ కేసులే:
న్యూఢిల్లీ: దేశాన్ని పట్టి పీడిస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతోన్న 19 రోజుల రెండోదశ లాక్డౌన్ మరో నాలుగు రోజుల్లో ముగియబోతోంది. వచ్చే నెల 3వ తేదీ.. అంటే ఆదివారం నాటికి రెండోదశ లాక్డౌన్ గడువు ముగుస్తోంది. నెలన్నర రోజులుగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి.

లాక్డౌన్ పొడిగింపు వైపేనా..
ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ను పొడిగిస్తారా? లేదా? అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన కొంత సడలింపులను మరిన్ని రోజుల పాటు కొనసాగిస్తారా? అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లాక్డౌన్ను పొడిగించడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని తన వైఖరి ఏమిటనేది సూచనప్రాయంగా వెల్లడించారనే వాదనలు ఉన్నాయి.

మాస్కులు ధరించకపోతే క్రిమినల్ చర్యలకు ఛాన్స్..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో సంకేతాన్ని ఇచ్చింది. లాక్డౌన్ను మరోసారి పాక్షికంగా సడలించాల్సి వస్తే..కొన్ని కఠిన చర్యలను అమలు చేయాల్సి ఉంటుందని చెబుతోంది. సడలింపుల తరువాత ముఖానికి మాస్కులు లేకుండా, లేక ఫేస్ కవర్లను ధరించకుండా రోడ్ల మీదికి వచ్చే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేసేలా చర్యలను తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

భవిష్యత్తులోనూ కరోనా తీవ్రత..
కరోనా వైరస్ దుష్ప్రభావం భవిష్యత్తులో కూడా కొనసాగబోవడం ఖాయమని, మాస్కులు మన జీవితంలో ఒక భాగం కాబోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత కూడా ప్రజలు స్వీయ క్రమశిక్షణను పాటించాల్సి ఉంటుందని సూచించారు. కరోనా నిర్మూలించలేమని, ఈ వైరస్ మన జీవితాల్లో ఓ భాగం అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ పరిస్థితులు మాత్రమే కరోనా వైరస్ను కట్టడి చేయలేవని, మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంటుందని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొనక తప్పదనీ ఆయన ముందస్తుగా హెచ్చరించారు.
Recommended Video

మాస్కులు తప్పనిసరి చేసేలా..
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం.. భవిష్యత్తులో కూడా మాస్కులను ధరించడం తప్పనిసరి కానుండటం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలోనే మాస్కులను ధరించడానికి పెద్దగా ఇష్టపడట్లేదు కొందరు. ఇక కరోనా ప్రభావం కాస్తో, కూస్తో తగ్గిన తరువాత లేదా లాక్డౌన్ నుంచి సడలింపులను ప్రకటించిన వేళ.. మాస్కులు ధరించకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం వెనుకాడబోదని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన తరువాత లేదా సడలింపులను ప్రకటించిన వేళ.. మాస్కులు లేకుండా రోడ్ల మీదికి వచ్చే వారిపై, సోషల్ డిస్టెన్సింగ్ను పాటించని వారిపై క్రిమినల్ కేసులను నమెదు చేసేలా చర్యలను తీసుకుంటోందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications