తిరుమలలో ముదురుతోన్న అన్యమత వివాదం: డిప్యూటీ ఈవోపై చర్యలకు డిమాండ్
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారిణి ఇటీవల చర్చికి వెళ్లడం, అదీ టిటిడి సమకూర్చిన కారులో కావడం వివాదానికి దారి తీసింది. ఈ అంశాన్ని హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు తీవ్రంగా పరిగణించడంతో వివాదం ముదురుతోంది.
డిప్యూటీ ఈవో కేడర్లో ఉన్న వారే ఇలా చేస్తే ఎలాంటి సందేశం వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆ అధికారిణిపై గతంలో ఉన్న ఆరోపణల రీత్యా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మఠాధిపతులు ఇప్పటికే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు.
హిందూ ధార్మిక సంస్థలు నిరసన వ్యక్తం చేయడంతో ఈవో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. దీనిపై టీటీడీ ఉద్యోగ సంఘాలు మాత్రం డిప్యూటీ ఈవో తప్పేమి లేదని, చర్చిలోని స్నేహితురాలిని కలవడానికే ఆమె అక్కడికి వెళ్లారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన చిత్రం కూడా పాతది అని చెబుతున్నారు.
కాగా, డిప్యూటీ ఈవో స్థాయి అధికారి స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్తున్నారని హిందూ పరిరక్షణ సంఘాలు ఆందోళనలు చేస్తుండటంతో విషయం వెలుగు చూసింది. కాగా అధికారులు ఈ విషయమై విచారణ చేపట్టారు.