ఐవైఆర్ తర్వాత వేమూరి ఆనంద్ సూర్య.. బాబుకు 'తెలంగాణ' చిక్కు
తాను ఐవైఆర్ కృష్ణారావు గురించి ఏం మాట్లాడదల్చుకోలేదని ఏపీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. కృష్ణారావు ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన వేమూరిని నియమించారు.
విజయవాడ: తాను ఐవైఆర్ కృష్ణారావు గురించి ఏం మాట్లాడదల్చుకోలేదని ఏపీ బ్రాహ్మణ సంఘం చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. కృష్ణారావు ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన వేమూరిని నియమించారు.
బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు అమరావతి చేరుకున్న వేమూరి మాట్లాడారు. తనకు ప్రాంతీయబేధాలు లేవని తెలిపారు. బ్రాహ్మణ సంఘం చైర్మన్గా బ్రాహ్మణులకు చేసిన పనులు చెప్పడం ముఖ్యమంత్రికి భజన చేయడం కాదన్నారు.

చంద్రబాబును అనడమా?
స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత బ్రాహ్మణుల సంక్షేమానికి అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యక్తిని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఆయన గురించి తానేమీ మాట్లాడనన్నారు.

తెలంగాణ వ్యక్తి అని విమర్శలు రావడంపై..
తాను తెలంగాణకు చెందినవాడినని పలువురు ఆరోపించడంపై వేమూరి స్పందించారు. పదవి దక్కితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారని ఆయన అన్నారు. తనకు ప్రాంతీయ బేధాలు లేవని, బ్రాహ్మణులకు సేవలందించడమే లక్ష్యమన్నారు.

తెలంగాణ వ్యక్తా.. సోషల్ మీడియాలో విమర్శలు
ఏపీలో అసలు బ్రాహ్మణులే లేరా? తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఏపీ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ వ్యక్తిని నియమించడాన్ని ఇప్పుడు సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. వైసిపి వంటి విపక్ష పార్టీలు కూడా ఈ అంశంతో చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నం చేయవచ్చు.

కృష్ణా రావును తొలగించడమా?
ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ పదవి నుంచి కృష్ణారావును తొలగించడం అనైతికమని, నీతి, నిజాయతీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనపై వేటు వేసి బ్రాహ్మణుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని కాంగ్రెస్ పార్టీ విజయవాడ సిటీ అధ్యక్షుడు మల్లాది విష్ణు విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసిపి నేత కలిస్తే తప్పేంటి
బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చంద్రబాబు చులకనగా చూస్తున్నారనడానికి నిదర్శనం కృష్ణారావుని పదవి నుంచి తొలగించడమేనని మల్లాది విష్ణు అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వైసిపి ఎమ్మెల్యే కోన రఘుపతిని ఆయన కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు చంద్రబాబు రాజకీయ రంగు పూస్తున్నారనడానికి ఇది తాజా నిదర్శనం అన్నారు.












Click it and Unblock the Notifications