విశాఖను రాజధానిగా ఒప్పుకుంటారా ? ఉత్తరాంధ్ర అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు : గుడివాడ అమర్నాథ్ ఫైర్
తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో టిడిపి నేతలు మాట్లాడిన దానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నిన్న ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో టిడిపి నేతలు దద్దమ్మల్లా మాట్లాడారని, అది ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదిక కాదని టిడిపి భజన మండలి సమావేశమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విశాఖను రాజధానిగా ఒప్పుకుంటారా లేదా ? ముందు చెప్పండి
ఉత్తరాంధ్రను భక్షించిన టీడీపీ నేతలే రక్షిస్తున్నట్లు మాట్లాడడం దారుణమని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతిస్తున్నారో లేదో ముందు చెప్పాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే అది చూసి ఓర్వలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నాడని ధ్వజమెత్తారు. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో టిడిపి వేదిక ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని, ఎన్నికల సమయంలో మాత్రమే టిడిపికి ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తుకు వస్తారు అని మండిపడ్డారు గుడివాడ అమర్నాథ్.

టీడీపీ నేతల తీరు వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఈ గతి
గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఈ దుస్థితి వచ్చిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు ఉద్యమిస్తున్నా, టిడిపి నేతలు ఎక్కడున్నారో తెలియడం లేదని గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. ఎవరి హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు టిడిపి నేతలు సిద్ధంగా ఉంటే రావాలని గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను అందించి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కష్టపడుతుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాదులో విలాసంగా సేదతీరుతున్నారని రాష్ట్రానికి తాను ప్రతిపక్ష నేతను అనే విషయాన్ని కూడా మరిచిపోయారని విమర్శించారు. ఇక ఎప్పుడైనా జనాలు మరిచిపోకుండా ఉండేందుకు ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు అంటూ మండిపడ్డారు.

విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు
గత ఎన్నికల్లో టిడిపిని చావుదెబ్బ కొట్టి ప్రజలు 151 మంది వైసిపి ఎమ్మెల్యేలను, వైయస్ జగన్ నాయకత్వాన్ని అంగీకరించి గెలిపించారని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు గానీ, టిడిపికి గాని రాష్ట్రంలో ఉనికి లేదని, అందుకే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పదేపదే ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ, ఆయన కుట్ర ఆలోచనలు మానుకోవటం లేదని విరుచుకుపడ్డారు. ఏ సమస్య గుర్తుకు రానప్పుడు, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతం అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు
రాష్ట్రంలో టిడిపి స్థాపించిన తర్వాత, ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పి, ఆ తర్వాత జగన్ సర్కార్ మీద మాట్లాడితే మంచిది అంటూ హితవు పలికారు. ఓట్లు, సీట్ల కోసం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వాడుకున్నారు తప్ప, రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యత వున్న విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా చేయలేదు అంటూ మండిపడ్డారు. విశాఖ ను అభివృద్ధి చేయాలనే ఆలోచన చేయని చంద్రబాబు నాయుడుకి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు అప్పుడు విశాఖపట్నాన్ని రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించి ఉంటే ఈరోజు విశాఖ నగర అభివృద్ధి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచన చేయాలని పేర్కొన్నారు. త్వరలోనే జగన్ సారధ్యంలో విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు కాబోతోందని గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు.

రాజధానిగా అమరావతి దేనికి ?
రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వెనుక కారణం ఏమిటో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. అసలు రాష్ట్ర విభజనకు కారణమే చంద్రబాబు అని మండిపడిన గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర కు చంద్రబాబు అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ప్రకటించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటే అడుగడుగున దాన్ని అడ్డుకుంటూ హై కోర్టులో పిటిషన్లు వేస్తున్నది టిడిపి కాదా అంటూ ద్వజమెత్తారు.
Recommended Video

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి టీడీపీ నేతలు మాట్లాడటానికి సిగ్గుండాలి
ఉత్తరాంధ్ర ప్రాంత టిడిపి నాయకులకు సిగ్గు లేదా అని ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్ ముందు చంద్రబాబు విశాఖను పరిపాలన రాజధానిగా అంగీకరించి, ప్రకటన చేసిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి టీడీపీ చర్చలు పెడితే బాగుంటుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గురించి టీడీపీ నేతలు మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అన్నారు. సిగ్గుపడటం నేర్పేందుకు టిడిపి నేతలకు, లోకేష్ కు చంద్రబాబు క్లాసులు పెట్టాలని ఎద్దేవా చేశారు. ప్రాంతం ఏదైనా సరే ఎక్కడైనా సరే ఉత్తరాంధ్ర పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చేసిన సవాల్ కు ప్రతి సవాల్ విసిరారు గుడివాడ అమర్నాథ్.












Click it and Unblock the Notifications