చంద్రబాబు ఇంటి గేటు దాటితే..తిరిగొచ్చేది కొడాలి నాని శవమే: బుద్ధా వెంకన్న: అరగంట చాలు
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండగ నాడు ఏర్పాటైన క్యాసినో వ్యవహారం.. రోజురోజుకూ ముదురుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-తెలుగుదేశం నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. అటు పోలీసు ఉన్నతాధికారుల పేర్లను కూడా ఈ వివాదంలో లాగే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఊహించినట్టే- పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకున్నారు ఆ పార్టీ నాయకులు. ఘాటు వ్యాఖ్యలతో ఆయనపై విరుచుకుపడ్డారు.
కొడాలి నానికి చుట్టే ప్రయత్నం..
సంక్రాంతి పండగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారని, లక్షల రూపాయలు ఈ సందర్భంగా చేతులు మారాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందీ అంశం.. తీవ్ర దుమారానికి దారి తీసింది. గుడివాడ- పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్ జగన్, కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు .. ఈ క్యాసినో ఏర్పాటు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. దీన్ని ఆయనకు చుట్టే ప్రయత్నం చేస్తోన్నారు.
బర్తరఫ్ ఎందుకు చేయట్లేదు..
కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా మురళి విమర్శించారు. ఆయనపై చర్యలను తీసుకోవడంలో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. కొడాలి నాని క్యాసినో ఆడించింది వాస్తవమని ఆరోపించారు. 200 కోట్ల రూపాయలను ఆయన దోచుకున్నారని విమర్శించారు. మంత్రి చేసిన తప్పులను ప్రశ్నించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీపై ఆయన గుండాలు దాడులు చేశారని ధ్వజమెత్తారు.
క్యాసినో ఆడిన వారిపై కేసుల్లేవా?
వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేశారో సమాధానం ఇవ్వాలని నిలదీశారు. క్యాసినో ఆడిన వారు, ఆడించిన వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టట్లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పని చేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని బుద్ధా వెంకన్న చెప్పారు.
కొడాలి నానికి కౌంట్డౌన్
కొడాలి నానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని నోరు పారేసుకుంటే తామూ చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. పార్టీ కార్యకర్తలు విశ్వరూపాన్ని చూపిస్తారని, తమకు ఓర్పు, సహనం నశించిపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కొడాలి నాని తగిన మూల్యాన్ని చెల్లంచుకునే పరిస్థితిని కల్పిస్తామని బుద్ధా వెంకన్న అన్నారు.
Recommended Video
గేటు తాకితే.. శవమే
చంద్రబాబు నాయుడి ఇంటి గేటును తాకినా కొడాలి నాని శవాన్ని వెనక్కి పంపిస్తామని బుద్దా వెంకన్న వార్నింగ్ ఇచ్చారు. కొడాలికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని, అలాంటి ద్రోహులకు టికెట్ ఇవ్వడమే చంద్రబాబు చేసిన పొరపాటని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అర గంటల్లో ప్రజలు కొడాలి నానిని చంపుతారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. దమ్ముంటే పోలీసులు లేకుండా, ఒంటరిగా రావాలని.. తేల్చుకుందామని బుద్ధా సవాలు విసిరారు.