విద్యార్థినుల బాత్రూమ్లల్లో హిడెన్ కెమెరాలపై స్పందించిన నారా లోకేష్
Gudlavalleru College of Engineering: కృష్ణాజిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూమ్లల్లో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు, నినదాలతో ఇంజినీరింగ్ కళాశాల మార్మోగిపోయింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తోన్నారు.
హాస్టల్ బాత్రూమ్లల్లో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినుల వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లల్లో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తోన్నారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గానీ, జిల్లా పాలనా యంత్రాంగం నుంచి గానీ ఎవరూ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదని తెలుస్తోంది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా…
— Lokesh Nara (@naralokesh) August 30, 2024
విద్యార్థుల నిరసన ప్రదర్శలకు సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తోన్న వాట్సప్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి.. వాళ్లను విచారించిన వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. విద్యార్థునుల హాస్టల్లో వాష్ రూమ్లల్లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించానని అన్నారు.
విచారణ సందర్భంగా తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని నారా లోకేష్ హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు మరే ఇతర కళాశాలల్లో కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications