Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుంటూరులో పెరుగుతున్న వైరల్ ఇన్ఫెక్షన్లు:ఈ నగరానికి ఏమైంది?...

గుంటూరు: గుంటూరు నగరంలో ఇటీవలి కాలంలో వివిధ వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇలా ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారిలో కొందరు ఏకంగా మృత్యువాతన పడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు.

ఇటీవలే గుంటూరులో కలరా బారిన పడి 30 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో తదనంతర పరిస్థితులను వైద్య శాఖ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో నగరంలో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు చాపకింత నీరులా విస్తరించడాన్ని వైద్యులు గమనిస్తున్నారు. ఇలా వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన రోగులు గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో గుంటూరు నగరంలో ఇన్ఫెక్షన్ల విస్తరణ గురించి వైద్య వర్గాల్లోనూ ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది.

 మళ్లీ వైరల్ మరణాలు...కలవరం

మళ్లీ వైరల్ మరణాలు...కలవరం

గుంటూరు నగరం రామిరెడ్డితోటకు చెందిన సాదు లక్ష్మీలావణ్య(22) కాన్పు కోసం గత నెల 11వ తేదీన గుంటూరు సర్వజనాసుపత్రిలో చేరింది. అయితే కాన్పు ప్రక్రియ, తదనంతర చికిత్స క్రమంలో అనూహ్యంగా తల్లీ, బిడ్డ ఇద్దరూ మార్చి 17వ తేదీన మరణించారు. దీంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులకు వారి శరీరంలో హెపటైటిస్‌-బి వైరస్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ వారి నివాసం ప్రాంతం పరిసరాల్లో ప్రతి ఇంటికీ తిరిగి సర్వే నిర్వహించగా అదే ఏరియాలో సుమారు 30 మందికి వైరల్‌ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు.

వణికిస్తున్న...వైరల్ ఇన్ఫెక్షన్లు

వణికిస్తున్న...వైరల్ ఇన్ఫెక్షన్లు

ఈ క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన షేక్‌ షరీఫ్‌(32) అనే వ్యక్తి హెపటైటిస్‌ - బి కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లో జిజిహెచ్ కు చికిత్స కోసం రాగా మెరుగైన వైద్య సేవల కోసం అతడిని శుక్రవారం సాయంత్రం రమేష్‌ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిసింది. వైద్యపరీక్షల్లో అతడి శరీరంలో బైలురూబిన్‌ అధిక మోతాదులో ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో డీఎంహెచ్‌వో యాస్మిన్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో శ్యామల ఈ వైరస్ బారిన పడిన ప్రాంతాల్లో తామే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు సేకరించారు. కలుషిత నీరు తాగి 23 మంది మృతి చెందడం, వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందడం మరచిపోక ముందే గుంటూరు నగరంలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు విజృంభించడంపై వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

 వైద్య శాఖ...అప్రమప్తం...

వైద్య శాఖ...అప్రమప్తం...

హైపటైటిస్ వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిన రోగుల ఇంటి వద్దకు ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరిస్తున్నట్లు తెలిసింది. వీరికి సమీపంలోని పిహెచ్ సి ల్లో వైద్య పరీక్షలు చేయిస్తూ అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా రామిరెడ్డితోట, గుంటూరువారితోట, పొత్తూరివారితోట, ప్రకాష్‌నగర్‌ ప్రాంతాల్లోనూ సర్వే కొనసాగిస్తూ రోగ నివారణా చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రకాష్‌నగర్‌లోనూ తాజాగా మరోవ్యక్తి హైపటైటిస్ ఇన్ఫెక్షన్‌ బారిన పడినట్లు వైద్య శాఖ సిబ్బంది గుర్తించారు. దీంతో ప్రత్యేకంగా సంచార వైద్య వాహనాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు.

కాక్సాకీ వైరస్‌ బారిన...చిన్నారులు

కాక్సాకీ వైరస్‌ బారిన...చిన్నారులు

మొన్న అతిసారం...ఇటీవలి కాలంలో హైపటైటిస్ వ్యాధుల బారిన పడిన గుంటూరు నగరంలో ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది. కాక్సాకీ వైరస్‌గా పిలిచే ఈ వైరస్ కారణంగా హ్యాండ్‌ ఫుట్‌ మౌత్‌ అనే వ్యాధి ప్రబలుతోంది. పెద్దల కంటే ఎక్కువగా చిన్నారులే దీని బారినపడుతున్నట్లు తెలిసింది. వ్యాధి బారినపడ్డ చిన్నారులకు నోరు, చేతులు, కాళ్లు, పిరుదుల భాగాల్లో నీటి కురుపులు వస్తున్నాయి. ఈ కురుపులతో ఒళ్లంతా జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. నోటిలోనూ కురుపులు అవుతుండటంతో తినడం కూడా కష్టంగా మారుతోంది. తినకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం కూడా ఉంది. కాక్సాకీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు నగరంలో ఇలా పెద్దలతో పాటు చిన్నారులు సైతం ప్రత్యేకంగా వైరల్ బారిన పడుతుండటంతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆహారం, తాగునీరు...కలుషితం వల్లే

ఆహారం, తాగునీరు...కలుషితం వల్లే

హైపటైటిస్ ఎ, ఇ అనే వైరస్‌లు కలుషిత ఆహారం,కలుషితమైన నీటి ద్వారా మన శరీరంలో ప్రవేశించి కాలేయం వాపును తెచ్చిపెడతాయని వైద్యులు చెబుతుండటంతో గుంటూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా ప్రజలకు తెలిసిన "పచ్చకామెర్లు" ఈ రెండు వైరస్‌ల కారణంగా వచ్చేవే. వీటి కారణంగా వచ్చే కామెర్లు మరీ అంత ప్రమాదకరమైనవి కావని వైద్యులు చెబుతున్నారు. అయితే మానవ శరీరంలో ప్రవేశించే ఏ వైరస్‌ అయినా లివర్‌పై ప్రభావం చూపొచ్చని, అందువల్ల ఎల్లప్పుడూ అప్రమప్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావ తీవ్రత ను శరీరంలో సంభవించే మార్పులను బట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తెలుసుకోవచ్చని...లేని పక్షంలో ఇవి లివర్ ను పూర్తిస్థాయిలో దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైమైనా గుంటూరు నగరంలో వైరస్ ల విజృంభణపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి నిలిపి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+